రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శించారు.కడప జిల్లా మైదుకూరులో జగన్ రెడ్డి బంధువు తిరుపాల్ రెడ్డి అనే వ్యక్తి అక్బర్ బాషా భూమి కబ్జా చేసినట్లు తెలిసిందని తెలిపారు.
కొంతమంది పోలీసులు తమ విధులను పక్కనపెట్టి సివిల్ పంచాయతీల్లో తలదూర్చడం మామూలైపోయింది అని పేర్కొన్నారు.తిరుపాల్ రెడ్డి వర్గానికి చెందిన సిఐ బాధితుడిని స్టేషన్ లో కూర్చోబెట్టి అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు చేయించారని తెలిపారు.
ఎన్కౌంటర్ చేస్తానని బాధితుని బెదిరించడం ఇంకా దారుణమని పేర్కొన్నారు.న్యాయం చేయాల్సిన పోలీసులు వారిపై దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి ఇంకెవరి దిక్కని ప్రశ్నించారు.
ప్రభుత్వం వెంటనే అక్బర్ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జగన్ బంధువులు, పార్టీ నేతలకు అధికారమే ఆయుధమైందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ లోకేష్ వేరొక ప్రకటనలో తెలిపారు.
సీఎం సొంత జిల్లాలో వైసీపీ కార్యకర్తలు, నేతలు అరాచకాలకు తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని రోదిస్తున్నారంటే ఏ స్థాయిలో దౌర్జన్యాలు జరుగుతున్నాయో అర్థమవుతుందని విమర్శించారు.జగన్ ప్రభుత్వం, రైతు వ్యతిరేక విధానాలపై రైతు కోసం తెలుగుదేశం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13 నుంచి 17 వరకు నిరసనలు చేపడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వైసీపీ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని విమర్శించారు.జగన్ రైతులకు చేస్తున్న మోసం, అన్యాయాన్ని ప్రజల్లో ఎండగడతామని ఈ నిరసన కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని అన్నారు.