కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మొదటి నుంచి ఉదాసీన వైఖరితో వ్యవహరించడం వల్లే ఆయన కారణంగా పార్టీ డ్యామేజ్ అయిందనే అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ రేవంత్ వర్గం మొదటి నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూనే వచ్చింది.
అంతేకాకుండా పిసిసి అధ్యక్ష పదవి విషయంలో రేవంత్ కు ఆ పదవి దక్కకుండా వెంకట్ రెడ్డి చేయాల్సిందంతా చేశారు.కానీ అధిష్టానం పెద్దలు మాత్రం రేవంత్ వంటి దూకుడు కలిగిన నేతతోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే విజయం సాధిస్తుందని నమ్మకంతో ఆయనకు ఆ పదవిని కట్టబెట్టారు.
ఇక అప్పటి నుంచి రేవంత్ ను టార్గెట్ గానే చేసుకుని వెంకట్ రెడ్డి అనేక వ్యవహారాలు చేపట్టారు.అధిష్టానం వద్దకు తరచుగా ఫిర్యాదులు తీసుకు వెళుతూ రేవంత్ ను వ్యతిరేకించే కాంగ్రెస్ నాయకుల్లో మొదటి వాడిగా ముద్ర వేయించుకున్నారు.
ఇక మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలోనూ పార్టీకి డామేజ్ చేసే విధంగా వెంకటరెడ్డి వ్యవహరిస్తుండడం , ఈ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు అంటూ వెంకటరెడ్డి ఫోన్ లో మాట్లాడిన మాటలు బయటకు లీక్ కావడం పెద్ద దుమారాన్నే రేపింది.
![Telugu Congress, Komatirajagopal, Reddy, Revanth, Telangana-Political Telugu Congress, Komatirajagopal, Reddy, Revanth, Telangana-Political](https://telugustop.com/wp-content/uploads/2022/10/Komati-Reddy-is-that-delay-Congress.jpg )
వాస్తవంగా రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి కృష్ణరావు అనే అభ్యర్థిని పోటీకి దించాలని చూసినా, అధిష్టానం వద్ద పట్టుబట్టి మరీ పాల్వాయి స్రవంతికి టికెట్ ఇప్పించుకున్నారు వెంకటరెడ్డి.కానీ ఎన్నికల ప్రచారానికి మాత్రం దూరంగానే ఉంటున్నారు .దీంతో ప్రచారానికి రావలసిందిగా పాల్వాయి స్రవంతి వెంకటరెడ్డి కోరినా… ఆయన మాత్రం ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు.కాంగ్రెస్ లో స్టార్ క్యాంపైనర్ హోదా పొందిన వెంకటరెడ్డి ఈ ఉప ఎన్నికలను బహిష్కరించినట్లుగానే వ్యవహరించారు.ఇక కీలక సమయంలో ఆయన విదేశాలకు వెళ్లిపోవడం, అక్కడ ఎన్నారైలతో భేటీ అయిన సందర్భంగా మునుగోడులో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు అంటూ మాట్లాడిన మాటలు బయటకు లీక్ అయ్యాయి.
ఈ వ్యవహారంపై అధిష్టానం సీరియస్ గానే స్పందించి వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేసింది.అయితే ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోంది .గతంలో ఆయనపై ఈ తరహా ఆరోపణలు వచ్చినప్పుడే ఆయనను కట్టడి చేసి ఉంటే పార్టీకి డామేజ్ జరిగి ఉండేది కాదని, ఎప్పటికి వెంకటరెడ్డి కారణంగా కాంగ్రెస్ కు ఎంతో డ్యామేజ్ జరిగిందని ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలకు అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగడం శుభ పరిణామం అంటూ కొంతమంది కాంగ్రెస్ కేలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.