ప్రస్తుతం జనసేన తెలుగుదేశం పార్టీలు ఏపీలో పొత్తు పెట్టుకోకపోయినా, ఎన్నికల నాటికి పొత్తు పెట్టుకుంటాయి అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది.గ్రామ స్థాయిలో జనసేన , టీడీపీలు అప్పుడే కలిసిపోయినట్టుగా నాయకుల మధ్య హుషారు కనిపిస్తోంది .
విశాఖ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకోవడం, ఆ తర్వాత విజయవాడలో పవన్ పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లడం తదితర పరిణామాలు తర్వాత టిడిపి, జనసేనలు పొత్తు పెట్టుకోబోతున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.ఇక వైసిపి ఈ రెండు పార్టీలను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది.
అప్పుడే రెండు పార్టీల మధ్య సీట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది.ఇదిలా ఉంటే తెలంగాణలో జనసేన, టిడిపిలు పొత్తు పెట్టుకుంటాయా అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ తెలుగుదేశం ను బలోపేతం చేస్తానంటూ చంద్రబాబు ఇటీవలే ప్రకటించారు.అంతేకాదు పార్టీ నాయకులకు ఈ మేరకు భరోసా ఇచ్చారు.అయితే తెలంగాణలో జనసేన కు అంత బలం లేకపోయినా, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆ పార్టీ బలం టీడీపీ కి కలిసి వస్తుంది అనే ఆశలు తెలుగుదేశం పార్టీలో మొదలయ్యాయి.ఏపీలో ఎన్నికల కంటే ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి.
టిడిపి తమకు బలం ఉన్న స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది.దీనికి జనసేన సహకారం ఉంటే.
అది తమకు మరింత కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటుంది.ఈ రెండు పార్టీలు వ్యవహారం ఇలా ఉంటే.
తెలంగాణా లో బిజెపి సైతం జనసేన పైనే ఆశలు పెట్టుకుంది. ఏపీలో అధికారికంగా రెండు పార్టీలు పోర్టు పెట్టుకున్నా… తెలంగాణలో మాత్రం ఈ పొత్తు లేదు.
అయినా బిజెపి అగ్ర నాయకుల తరఫున పవన్ ప్రచారం చేసేందుకు అంగీకరిస్తారా అనేది తేలాల్సి ఉంది.

అయితే గతంలో పవన్ మద్దతు తమకు అవసరం లేదంటూ కొంతమంది బీజేపీ తెలంగాణ నాయకులు విమర్శలు చేశారు.ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి వారు మాత్రం జనసేన మద్దతు పొందేందుకు పవన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.ఏపీలో టిడిపి, జనసేన, బిజెపిల మధ్య పొత్తు కుదిరితే ఆ ప్రభావంతో తెలంగాణలోనూ ఈ మూడు పార్టీలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే ఏపీలో బిజెపిని పక్కన పెట్టే విధంగా పవన్ వ్యవహరిస్తుండటం తో ఆ పార్టీకి అండగా నిలబడతారా లేక దూరం పెడతారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
.






