టిడిపి , జనసేన, బిజెపి పార్టీలు అదే పనిగా వైసీపీ పై విమర్శలు చేస్తూనే వస్తున్నాయి.అధికార పార్టీ గా వైసిపి ఉండడంతో ఆ పార్టీ ని టార్గెట్ చేసుకుని ప్రజల్లో చులకన చేసి, తమ పార్టీల ప్రభావం పెంచుకోవాలనే లక్ష్యంతో మూకుమ్మడిగా జగన్ ను ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం లోని లోపాలను సైతం ఎత్తి చూపిస్తూ జగన్ ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా చేసేందుకు నిరంతరం శ్రమిస్తూ వస్తున్నారు.అవకాశం దొరికినప్పుడల్లా వీరంతా విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
మొదట్లో ఈ విమర్శలకు జగన్ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించినా, ఇప్పుడు మాత్రం అసలు పట్టించుకోవడం లేదు.ప్రతిపక్షాలు అన్న తరువాత విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటాయి అనే అభిప్రాయం తో పాటు, అనవసరంగా ఆ విమర్శలకు స్పందిస్తే ,అది వారికి మేలు చేస్తుందనే ఉద్దేశం జగన్ లో కనిపిస్తోంది.
ఇక జనాల లోనూ ఇదే రకమైన అభిప్రాయం ఉంది.ప్రతిపక్షాల విమర్శలు సర్వసాధారణమైనవే అని, ఇవన్నీ రాజకీయాల్లో మామూలే అని భావిస్తూ ఉంటారు.అయితే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారు, జగన్ సామాజికవర్గానికి చెందిన నేతలు కొంతమంది ఇప్పుడు జగన్ ను ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండడం పైనే జనాల్లో చర్చ జరగడంతో పాటు, జగన్ సైతం ఆందోళన లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.వైసీపీ నుంచి గెలిచి గత కొద్ది నెలలుగా జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శలతో చాలా వరకు ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది.
నిత్యం క్రమం తప్పకుండా ఏదో ఒక అంశం పై విమర్శలు చేస్తూ జగన్ కు, ఆ పార్టీలోని నాయకులకు అసహనం కలిగించేవారు.
మొదట్లో రఘురామ విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్లు ఇచ్చేవారు.
ఇక ఆ తర్వాత ఆయన సంగతిని జనాల తో పాటు, వైసిపి నాయకులు మరిచిపోయారు.

ఆయన విమర్శలు చేస్తున్నా, పెద్దగా పట్టించుకొనట్టుగా వ్యవహరిస్తున్నారు.ఇక ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఉండవల్లి అరుణ్ కుమార్ , జగన్ సామాజిక వర్గానికి చెందిన డిఎల్ రవీంద్రా రెడ్డి వంటి వారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు.
దీంతో ఆయన చేసే విమర్శలను జనాలు నమ్ముతున్నారు.ఇక డి.ఎల్.రవీంద్రారెడ్డి విషయానికి వస్తే ఆయన రెడ్డి సామాజిక వర్గం కు చెందిన నేత , అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.ఆయన ఢిల్లీ నుంచి ఏపీ ప్రభుత్వం పై చేసిన విమర్శలు పెద్ద దుమారమే రేపాయి.టీడీపీ, జనసేన, బిజేపి లు ఎన్ని విమర్శలు చేసినా కలగని డ్యామేజ్ ఈ తటస్థ నాయకులు, రాజకీయ ఉద్దండులు చేసిన విమర్శల కారణంగా కలుగుతుంది.
అందుకే జగన్ అలెర్ట్ గా ఉండాల్సిందే అన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తం అవుతున్నాయి.