కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది.కాలికి వేస్తె వెలికి,వెలికి వేస్తే కాలికి అన్నట్లు గా అక్కడ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇటీవల సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుక లు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలకు చెందిన దాదాపు 14 మంది ఎమ్మెల్యే లు రాజీనామా లు చేసిన విషయం విదితమే.
అయితే బెంగుళూరు నుంచి ఆ రెబల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ మకాం ముంబై కి మార్చేశారు.అక్కడే ఉంటె ఏదోరకంగా వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారని భావించి వెంటనే అక్కడ నుంచి హుటాహుటిన ముంబై నగరానికి మకాం మార్చేశారు.
ముంబై లోని రినైజాన్స్ హోటల్ లో వారంతా బస చేస్తున్నారు.

అయితే హోటల్ లో బస చేసిన జేడీ-ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించి తిరిగి బెంగుళూరు చేర్చి వారిని శాంత పరచడానికి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మంత్రి డి.కె.శివకుమార్ ముంబై వెళ్లారు.దాదాపు 100 మంది తన మద్దతుదారులతో ఆ హోటల్ వద్దకు చేరుకున్న ఆయన ను పదుల సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి హోటల్ లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.తాను ఈ హోటల్ లోని ఎమ్మెల్యేలతో కాసేపు కూర్చుని మాటామంతీ చేసి వారితో కలిసి కాఫీ తాగి వస్తానని ఎంతగా వారించినా పోలీసులు ఆయన అభ్యర్ధనను తిరస్కరించారు.
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పాపులర్ అయిన శివకుమార్ ముంబైలో తన ‘ చాణక్యాన్ని ‘ ప్రదర్శించలేకపోయారు.మరోపక్క హోటల్ లో ఉన్న ఆ రెబల్ ఎమ్మెల్యేలు తమకు కర్ణాటక సీఎం కుమారస్వామి నుంచి, శివకుమార్ నుంచి ప్రాణ హాని ఉందని, ఏ క్షణమైనా వారి అనుచరులు ఈ హోటల్ పై దాడి చేసి తమను బలవంతంగా బెంగుళూరుకు తరలించే ప్రమాదం ఉందంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం తో పోలీసులు వారికి ఆ హోటల్ వద్ద భారీ బందోబస్తు నిర్వహించి శివకుమార్ ను అడ్డుకున్నట్లు తెలుస్తుంది.

అయినప్పటికీ హోటల్ను విడిచి వెళ్లకుండా శివకుమార్ అక్కడే కూర్చోవడంతో శాంతి భద్రతల దృష్ట్యా హోటల్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు కొద్దిసేపటి క్రితం డీకే శివకుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మరోపక్క ఇటీవల రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యే లలో 8మంది సభ్యుల లేఖలు సరిగా లేవని స్పీకర్ రమేష్ కుమార్ పెండింగ్ లో పెట్టారు.దీనితో ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న కుమారస్వామి ప్రభుత్వానికి ఊరట లభించినట్లు అయ్యింది.