నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కాలం కలిసి రానట్టే కనిపిస్తుంది.కొంతకాలం క్రితమే వైసిపి ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy).
ఈ వ్యవహారంపై వైసీపీ(YCP) అధిష్టానం కూడా సీరియస్ అయింది.వెంటనే శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని(Adala Prabhakar Reddy) నియమించారు.
ఇక శ్రీధర్ రెడ్డి టిడిపిలో చేరబోతున్నట్లుగా ప్రకటించడమే కాకుండా, 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టిడిపి అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానంటూ సంచలన ప్రకటన చేశారు.ఈ వ్యవహారం టిడిపిలోనూ పెద్ద దుమారమే రేపింది.
పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండా.ఇంకా పార్టీలో చేరకుండా శ్రీధర్ రెడ్డి టికెట్ ను ఎలా ప్రకటించుకుంటారు అంటూ టిడిపి సీనియర్ నేతలు భగ్గుమన్నారు.
ముఖ్యంగా ఆయన రాకను నెల్లూరు జిల్లాలో ఉన్న టిడిపి సీనియర్ నాయకుడు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Former Minister Somireddy Chandramohan Reddy) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.దీంతో శ్రీధర్ రెడ్డి టిడిపిలోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
ఇది ఎలా ఉంటే.తాజాగా శ్రీధర్ రెడ్డికి వైసిపి అధిష్టానం మరో జలక్ ఇచ్చింది.వైసిపి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని ఆ పదవి నుంచి వైసీపీ అధిష్టానం తొలగించింది.ఈ మేరకు లేఖ కూడా విడుదల చేసింది.
గిరిధర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకే ఆయనను తొలగిస్తున్నట్లుగా వైసిపి అధిష్టానం పేర్కొంది.అయితే ఈ వ్యవహారంపై శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి, తన సోదరుడిని పార్టీ నుంచి తొలగించడంపై ఆయన స్పందిస్తారని శ్రీధర్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున గిరిధర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.ఒకవేళ తన సోదరుడు గిరిధర్ రెడ్డి(Giridhar Reddy) వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తే తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని, తన తమ్ముడికి వ్యతిరేకంగా తాను పోటీ చేయనని, అవసరం అయితే ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతాను అంటూ శ్రీధర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.