టీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది.తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండగా, ఆయన కుమారుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మంత్రిగా ఉన్నారు.
అంతేకాదు తెలంగాణలో తన హవా చూపిస్తున్నారు.సీఎం కేసీఆర్ పరిపాలన పై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతూ, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించే పనిలో ఉండగా, కేటీఆర్ మాత్రం పార్టీ విషయాల్లో చురుగ్గా పాల్గొంటూ అన్ని విషయాలను చక్కబెట్టుకుంటున్నారు.
ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.త్వరలోనే కేటీఆర్ తెలంగాణ సీఎం కాబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.
ఇంతవరకు బాగానే ఉన్నా, టిఆర్ఎస్ తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది దాటుతోంది.ఎన్నికల సమయంలో టిక్కెట్లు దక్కని వారికి అప్పట్లో కార్పొరేషన్లకు, వివిధ నామినేటెడ్ పోస్టుల్లో నియమించేందుకు కెసిఆర్ కేటీఆర్ హామీలు ఇచ్చారు.
దీంతో అప్పట్లో పదవుల హామీలు పొందిన వారంతా కెసిఆర్, కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారు.సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉంటున్నారు.నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నవారంతా ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.ఇంత వరకు బాగానే ఉన్నా, నామినేటెడ్ పదవులు గురించి చర్చించే విషయంలో ముందుగా కేసీఆర్ ను కలవాలా, లేక కేటీఆర్ ను కలవాలా అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

ఎవరైనా ముందుగా టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ను కలిసిన తరువాత కేటీఆర్ ను కలిస్తే పెద్ద సార్ ను కలిశారంట కదా, పెద్దాయన మంచిగా ఉన్నారా అంటూ ప్రశ్నిస్తున్నారట.పోనీ ముందుగా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిసిన తర్వాత కెసిఆర్ ను కలిస్తే ఎక్కువగా చీటికి మాటికి కేటీఆర్ ను ఎందుకు కలుస్తున్నారు అంటూ అటు నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నారాయట.దీంతో ఇప్పుడు ఎవరిని ముందుగా కలిస్తే ఎవరికి కోపం వస్తుందో అన్న సందిగ్ధంలో తెలంగాణ నాయకులు పడిపోయారు.ఈ కొత్తరకం తలనొప్పులు ఏంటి అంటూ వారంతా ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.