మణిపూర్ అల్లర్ల వ్యవహరంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.ఈ క్రమంలో మణిపూర్ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది.
ఈ నేపథ్యంలోనే మణిపూర్ డీజీపీకి సమన్లు జారీ చేసిన న్యాయస్థానం మణిపూర్ లో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విచ్ఛిన్నమైందని పేర్కొంది.మణిపూర్ లో శాంతి భద్రతలు లేవన్న సుప్రీం కోర్టు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మే నెల నుంచి జూలై వరకు రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని స్పష్టం చేసింది.రాష్ట్ర పోలీసులు కేసులను దర్యాప్తు చేయడంలో అసమర్థులుగా కనిపిస్తున్నారని మండిపడింది.
ఈనెల 7న కోర్టులో హాజరు కావాలని మణిపూర్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.ఆగస్ట్ 4వ తేదీలోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని పేర్కొంది.
మణిపూర్ లో ఎఫ్ఐఆర్ ల దాఖలు తీరు సరిగా లేదని వెల్లడించింది.ఇప్పటివరకు నమోదైన ఆరు వేలకు పైగా ఎఫ్ఐఆర్ లను నేర తీవ్రతను బట్టి విభజించాలని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ క్రమంలోనే మణిపూర్ లో మారణ హోమంపై వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.మొత్తం కేసులను సీబీఐ దర్యాప్తు చేయడం అసాధ్యమన్న ధర్మాసనం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి మణిపూర్ లో పరిస్థితులను చక్కదిద్దాలని స్పష్టం చేసింది.
మే 4న జరిగిన ఘటనపై మణిపూర్ పోలీసులు విచారణ చేయకూడదని చెప్పింది.భవిష్యత్ కార్యాచరణను సోమవారం నిర్ణయిస్తామని వెల్లడించింది.
అనంతరం తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.







