ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్ గడువు సమీపిస్తోంది.ఈ నేపథ్యంలో ఏయే ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలో నిర్ణయించే పనిలో నిమగ్నమయ్యాయి ఫ్రాంచైజీలు.
రిటైన్ చేసుకున్న క్రికెటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం కూడా ఒక సవాలుగా మారడంతో ఫ్రాంచైజీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.ఈసారి ఆటగాళ్లు అదే ఫ్రాంచైజీలో కొనసాగేందుకు భారీ ధర డిమాండ్ చేస్తున్నారు.
మరికొందరు ఆటగాళ్లు వేరే ఫ్రాంచైజీలోకి జంప్ చేసేందుకు సానుకూలత చూపుతున్నారు.ఈ రెండు అంశాలు కూడా ఫ్రాంఛైజీలకు పెద్ద సమస్యలుగా మారాయి.
ప్రధానంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏయే ఆటగాళ్లను నిలుపుకోవాలో తెలియక తలమునకలవుతోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, కెప్టెన్ కేన్ విలియమ్సన్ను సన్రైజర్స్ రిటైన్ చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను కూడా రిటైన్ చేసుకోవాలని భావిస్తోంది.కానీ అందుకు రషీద్ ఖాన్ మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు.పోయినసారి అతడికి రూ.9 కోట్లు ఇచ్చిన సన్రైజర్స్ ఫ్రాంచైజీ ఈసారి రూ.12 కోట్లు ఆఫర్ తో రిటైన్ చేయాలనుకుంటోంది.కానీ ఆ ఆఫర్ పట్ల రషీద్ ఖాన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.అంతేకాదు రూ.12 కోట్లు తనకు సరిపోవని రషీద్ ఖాన్ నిర్మోహమాటంగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక ఫ్రాంచైజీ నలుగురు క్రికెటర్లను రిటైన్ చేయదలుచుకుంటే మొదట ఆటగాడికి రూ.16 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.రెండో ఆటగాడికి 12 కోట్లు ఇవ్వాలి.ఆ విధంగా మొదటి ఆటగాడిగా విలియమ్సన్కు రూ.16 కోట్లు ఇచ్చి తర్వాత రెండో ఆటగాడిగా రషీద్ ఖాన్ కి రూ.12 ఆఫర్ చేయాలనుకుంది సన్రైజర్స్ యాజమాన్యం.కానీ రషీద్ ఖాన్ మాత్రం తనని మొదటి ఆటగాడిగా రిటెన్షన్ చేసుకుని రూ.16 కోట్ల ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.లేదంటే తనని విడిచిపెట్టాలని.వేలంలో తనకు మంచి ధర లభిస్తుందని చెబుతున్నాడట.దీంతో సన్రైజర్స్ కు షాక్ తగిలినట్లయింది.ప్రస్తుతానికి ఈ విషయమై యాజమాన్యం చర్చోపచర్చలు జరుపుతున్నట్లు సమాచారం.