నల్లగొండ జిల్లా:(Nalgonda District)సత్వర ప్రజా సమస్యల పరిష్కారం చేపట్టి ఇందిరమ్మ రాజ్యం నిర్మాణం కోసమే ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Miryalaguda MLA Bathula Lakshmareddy)అన్నారు.సోమవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో ఆయన పాల్గొని ఇప్పటి వరకు స్వీకరించిన సమస్యలను ఎంతవరకు పరిష్కరించారని శాఖల వారిగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల గ్రామస్థాయిలోనే పంచాయితీ కార్యదర్శులు క్రియాశీలకంగా వ్యవహరిస్తే ప్రజలకు చాలా సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయని, ఆ దిశగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.స్థానికంగా ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గం చూపితే మండల,డివిజన్, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం రాదన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి తాను నిద్ర పోనని అధికారులను సైతం నిద్రపోనిచ్చేది లేదన్నారు.రైతు భరోసా విషయంలో రైతులు అపోహాలకు గురికావద్దని, గత ప్రభుత్వం సాగులో లేని వందల ఎకరాల భూములను బీఆర్ఎస్ (BRS)నాయకులు దొంగ పట్టాలు చేసుకుని రైతుబంధు డబ్బులని కొల్లగొట్టారని, తిరుమలగిరి సాగర్ మండలంలో(Tirumalagiri Sagar Mandal) ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని సర్వే చేపట్టగా సుమారు 120 ఎకరాల భూమి సాగు లేకున్నా దొంగ పాస్ పుస్తకాలతో రైతుబంధు సొమ్మును దోచుకున్నారని తెలిసిందని,ఆ విధమైన పొరపాటు కాంగ్రెస్ పాలనలో ఉండకూడదనే రైతు భరోసా విషయంలో కమిటీని వేసి విధివిధానాలకు అనుగుణంగా సాగులో ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా (Rythu Bharosa)అందించడం జరుగుతుందన్నారు.
ఈ విషయంలో ప్రతిపక్షాల మాయమాటలకు మోసపోయి ఆందోళనకు గురికావద్దన్నారు.ప్రస్తుతం పంట మార్పిడి చేపడుతున్నందున గ్రామీణ ప్రాంతం నుంచి ధాన్యం తరలించడంలో ఇబ్బందులు కలగకుండా రోడ్డు మరమ్మతులకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బి ఇరిగేషన్ అధికారులకు సూచించారు.అనంతరం సల్కునూరు పిఎసిఎస్ కేంద్రంలో నాబార్డ్ నిధులు రూ.24.32 లక్షలతో నిర్మించిన 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును ప్రారంభించారు.మిల్లర్లు సైతం రైతులు నష్టపోకుండా లేనిపోని సాకులతో ధరలను తగ్గించవద్దని,అలా చేయకుండా అధికారులు మిల్లు పాయింట్లు వద్ద పర్యవేక్షణ చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శారదాదేవి,తాహసిల్దార్ సాదత్,డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, ఉపాధ్యక్షుడు రావు ఎల్లారెడ్డి,టీపీసీసీ నెంబర్ చిరుమరి కృష్ణయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్, మండల పార్టీ అధ్యక్షుడు మాలి కాంతారెడ్డి,గడ్డం వేణుగోపాల్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గడ్డం శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.