వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన పలువురు భారతీయులు అక్కడ అనుకోని పరిస్ధితుల్లో పలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు.వీరిలో కొందరు ఉద్దేశపూర్వకంగా నేరాలు చేస్తే.
ఇంకొందరు మాత్రం ప్రత్యేక పరిస్ధితుల్లో కేసుల్లో చిక్కుకుంటున్నారు.ఈ విధంగా దాదాపు 10,640 మంది భారతీయులు వివిధ దేశాల్లో విచారణ కోసం ఎదురుచూడటమో లేదా దోషులుగా తేలడమో జరిగిందని కేంద్ర విదేశాంగ శాఖ పార్లమెంట్కు తెలియజేసింది.
మొత్తం 69 దేశాలకు గాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అత్యధిక మంది భారతీయులు/ భారత సంతతి వ్యక్తులు విచారణ కోసం ఎదురుచూస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.
లోక్సభలో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
అండర్ ట్రయల్, విదేశాలల్లో ఖైదీలుగా వున్న వారు, నేరాల వివరాలను విదేశాంగ శాఖ వెల్లడించింది.అయితే విదేశాల్లోని కఠినమైన గోప్యతా నియమాల కారణంగా అక్కడి అధికారులు సమ్మతిస్తే తప్పించి దోషులకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి వీలు లేదని తెలిపింది.
53 దేశాల్లో 1,297 మంది భారతీయులు అండర్ ట్రయల్లో వుండగా… 62 దేశాల్లో 3,580 మంది భారతీయులు దోషులుగా వున్నారు.ఐదు దేశాల్లోని అండర్ ట్రయల్, ఖైదీల గురించిన డేటా అందుబాటులో లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.వివిధ దేశాల్లో ఉల్లంఘనలకు సంబంధించి పురుషులు, మహిళలు ఇద్దరూ బుక్ అయ్యారని తెలిపింది.దహనం, దాడి, హత్య, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన, చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి వుండటం, నకిలీ కరెన్సీని కలిగి వుండటం, మాదక ద్రవ్యాల రవాణా, నకిలీ పాస్పోర్ట్, ఆర్ధిక నేరాలకు సంబంధించిన కేసుల్లో భారతీయులు విచారణను ఎదుర్కొంటున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.