నల్లగొండ జిల్లా:ఊరందరిదీ ఒకదారైతే ఉలిపి కట్టెది ఒక దారి”అన్నట్లు నాయకులు,అధికారులు,ఎన్నికల (Election )హడావుడిలో ఉంటే నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం( Vemulapally ) శెట్టిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని రావువారిగూడెంలో కొందరు అక్రమార్కులు అక్రమ మట్టి వ్యాపారం జోరుగా చేస్తూ,ట్రాక్టర్ మట్టిని పట్టణాలకు తరలిస్తూ ట్రిప్పుకు రూ.800 నుండి రూ.1500 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాత్రి పగలు తేడా లేకుండా దళారులు,కాంట్రాక్టర్లు ప్రభుత్వ,ప్రైవేట్ భూముల్లో జేసీబీలతో మట్టిని తవ్వుతూ యధేచ్చగా మట్టి మాఫియాను కొనసాగిస్తున్నా అడ్డుకట్ట వేయాల్సిన మైనింగ్ అధికారులు( Mining authorities ) తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందంటున్నారు.
ఈ మట్టి మాఫియా దందా గత కొన్ని రోజులుగా జరుగుతుందని,స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే మీకు చేతనైంది చేసుకోండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు.ఇప్పటికైనా రెవిన్యూ, మైనింగ్ అధికారులు స్పందించి తక్షణమే మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.