ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలోని వరద ముంపు బాధిత ప్రాంతాలైన చౌడేశ్వరీ కాలనీ, మారుతీనగర్ , ఫలనీ నగర్ , పోచనపల్లి లో పర్యటించారు.ఈ సందర్భంగా అక్కడి ప్రజలు మూడు రోజులు అవుతున్నా వరద నీటిలోనే జీవనం సాగిస్తున్నామని ఎమ్మెల్యే ఎదుట గోడు వెల్లబోసుకున్నారు.
ప్రజల సమస్యలు విన్న ఎమ్మెల్యే బాలకృష్ణ మీ సమస్యలు కళ్ళారా చూసానని తప్పకుండా అన్నిటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక పంచాయతీ నిధులను దారి మళ్లించి సర్పంచుల అధికారాలకు కత్తెర వేసిందన్నారు.
సర్పంచులు ఈ విషయమై ఆందోళన దిగితే భేషరతుగా మద్దతు తెలియజేస్తానని స్పష్టం చేశారు.వారు ఎలాగో అభివృద్ధి చేయరు సర్పంచులకు అభివృద్ధి చేసే అవకాశం లేదని వైసీపీ ప్రభుత్వానికి చురకలంటించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగడం, హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.టిడిపి హయాంలో దోమలపై దండయాత్ర చేపడితే అసెంబ్లీలో హాస్యాస్పదంగా మాట్లాడారని ప్రస్తుతం అదే దోమల వల్ల రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు దాదాపు 2000 మంది మృత్యువాత పడ్డారని చెప్పారు.
వరద ముంపు బాధిత ప్రాంతాల్లో ప్రజారోగ్యం దెబ్బ తినకుండా వారికి వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు మందులన్నీ ఉచితంగా అందజేస్తామన్నారు.వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.