నల్లగొండ జిల్లా:నాడు మహాభారతంలో ధర్మరాజు ధర్మం తప్పేవాడు కాదని అంటుంటే వినడమే కానీ,చూసిన వారు ఎవరూ లేరు.కానీ,నేడు నల్లగొండ జిల్లాలో ఓ ధర్మరాజు తన పేరుకు తగినట్లుగా ధర్మాన్ని చాటిచెప్పి కలియుగ ధర్మరాజుగా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.
వివరల్లోకి వెళితే మునుగోడు మండలం కొంపల్లి గ్రామానికి చెందిన వక్కంటి ధర్మరాజుకు సర్వే నెంబర్ 138 లో ఎకరం 34 గుంటల భూమి ఉండేది.ఆ భూమిని అదే గ్రామానికి చెందిన బోయపర్తి చిన్న నర్సింహా, బోయపర్తి చిన్న మైసయ్యలకు 30 సంవత్సరాల క్రితం విక్రయించాడు.
విక్రయ సమయంలో కేవలం తెల్లకాగితం మీద అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు.అయితే కొనుగోలు చేసిన వ్యక్తులు ధర్మరాజు రాసిచ్చిన అగ్రిమెంట్ కాగితం ఎక్కడో పోగొట్టుకున్నారు.
దీనితో ఆ భూమిని తమ పేరు మీద పట్టా చేసుకోకుండా అలాగే ఉండిపోయారు.దాదాపు 30 ఏళ్ళు కావడంతో ఏం చేయాలో అర్థంకాక ఈ విషయాన్ని ధర్మరాజుకే తెలియచేశారు.
స్వార్జితమై,డిజిటల్ పట్టాలున్న భూములే అక్రమంగా కబ్జాలుచేసి ఆక్రమించుకుంటున్న రోజుల్లో ఇలాంటి అవకాశం వస్తే ఎవరైనా ఏం చేస్తారు.ఆ భూమి తనదని,తాను ఎవరికీ విక్రయించలేదని అధర్మంగా తిరిగి భూమిని స్వాధీనం చేసుకోవడం,లేదా మళ్ళీ అగ్రిమెంట్ చేయాలంటే ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు చెల్లిస్తే అగ్రిమెంట్ చేస్తానని మెలిక పెట్టేవారు.
కానీ,వక్కింటి ధర్మరాజు అందరిలాంటి వాడు కాదు.తాను ధర్మాన్ని తప్పనని 30 ఏళ్ల క్రితం తన భూమిని వారికి అమ్మినది నిజమేనని ఒప్పుకున్నాడు.
పైగా వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వారి కుటుంబ సభ్యులపై మండల ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించి సార్ధకనామదేహుడని నిరూపించుకున్నాడు.ఈ సందర్బంగా ధర్మరాజు యొక్క వ్యక్తితవాన్ని చూసి మండల తహశీల్దార్ జక్కర్తి శ్రీనివాస్ ఆశ్చర్యానికి లోనయ్యారు.
వెంటనే ధర్మరాజు నీతి,నిజాయితీకి ముగ్ధుడయ్యి కార్యాలయంలోనే శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ ఇలాంటి గొప్ప వ్యక్తులు సమాజానికి ఎంతో ఆదర్శమని కొనియాడారు.
ఇలాంటి వ్యక్తులు ఉంటే సివిల్ కేసుల్లో తమకు పనేముంటుందని స్థానిక ఎస్ఐ సతీష్ రెడ్డి కూడా ధర్మరాజుకు సత్కరించి ప్రశంసలతో ముంచెత్తరు.విషయం తెలుసుకుని స్థానికి ప్రజలు కూడా వక్కింటి ధర్మరాజు తన పేరుకి తగినట్లుగానే వ్యవహరించి,మాయమైపోయిన మనిషిని తిరిగి బ్రతికించి,సమాజంలో మంచి వ్యక్తిగా నిలిచారని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.