సంచలన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజానికి అవసరమయ్యే వార్తలకు సముచిత స్థానం కల్పిస్తే సమాజంలో మార్పుకు మనం నాంది కావచ్చని, ప్రతీరోజు నిరంతరం మనం ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉండాలని,మరీ ముఖ్యంగా జర్నలిజంలో నిరంతరం మనల్ని మనం నవీకరించుకోవాలని నల్లగొండ జిల్లా అదనపు పాలనాధికారి టి.పూర్ణచంద్ర అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో జర్నలిస్టులకు(Journalists) ఏర్పాటు చేసిన “వార్తలాప్ – వర్క్ షాప్” కు ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ నేడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం నవీకరించుకుంటూ, సమాజంలో 4వ స్తంభంగా మీడియా తన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తే సమాజంలో మంచి మార్పును మనం చూడవచ్చన్నారు.ప్రజాభిప్రాయ ప్రకారం నిజ నిర్ధారణ చేసుకొని వార్తలు రాస్తే బాగుంటుందని, పిఐబి(PIB) లాంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నేడు మన మధ్యకు వచ్చి జిల్లా స్థాయిలో వర్క్ షాప్లను నిర్వహిస్తోందని,ఇందుకు పిఐబి బృందాన్ని అభినందిస్తున్నానని అన్నారు.
పోషణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫోటో ఎగ్జిబిషన్(Photo exhibition) మన దైనందిన జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి,మనం తినాల్సిన వాటి గురించి వివరంగా తెలియజేసేలా ఉందని, ఈ ఎగ్జిబిషన్ ని సాధ్యమైనంత వరకు అందరూ ఒకసారి తిలకించి అవగాహన పెంచుకోవాలని కోరారు.ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్టు పోషణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ గురించి నల్లగొండ జిల్లా ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వర రావు వివరించారు.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్,పత్రికా సమాచార కార్యాలయం అందిస్తోన్న సేవల గురించి ఆయన వివరంగా తెలియజేశారు.పిఐబి పనితీరు గురించి పిఐబి అధికారులు గాయత్రి, శివచరణ్ రెడ్డి వివరణాత్మకంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎస్పీ సైబర్ క్రైమ్ లక్ష్మీనారాయణ,పిఐబి అధికారులు,సిబ్బంది, సిబిసి సిబ్బంది,డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు,ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.