తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, జూనియర్ నేతల మధ్య విభేదాలతో మరో సారి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది.నేడు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఓ హోటల్ లో సమావేశమైన విషయం తెలిసిందే.
అయితే కాంగ్రెస్ సీనియర్ లకు పెద్ద ఎత్తున అన్యాయం, అవమానం జరుగుతున్నదని రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మాణిక్యం ఠాగూర్ వీరి ముగ్గురికి నచ్చినట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని మిగతా సీనియర్ నేతల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని ఇలానే కొనసాగితే పంజాబ్ లాంటి పరిస్థితి తెలంగాణలో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి.

అయితే పార్టీలలో ఉన్న నేతలందరిని ప్రతి ఒక్క విషయంలో పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఒకరిద్దరు కేంద్రంగానే పార్టీలో నిర్ణయాలు జరిగితే పార్టీ నష్టపోతుందని రాష్ట్రంలో పార్టీ ఉంటుంది కానీ రాజకీయంగా పార్టీ అభివృద్ది అయ్యే విషయంలో కానీ బలపడే విషయంలో కాని ఏ మాత్రం పురోగతి కనిపించే ఆస్కారం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయ పడ్డారు.అయితే నేను రేవంత్ రెడ్డి నిర్ణయాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని అటువంటి నిర్ణయాల వల్ల పార్టీ నష్టపోతుందని కావున సీనియర్ నేతలందరం కలిసి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.తెలంగాణలో పార్టీ పరిస్థితిని అధిష్టానానికి తెలిపే ప్రయత్నం చేస్తామని అన్నారు.
ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే రోజుకొకరి బండారం బయటపెడుతానని, సస్పెండ్ చేసినా అధిష్టానానికి విధేయునిగా ఉంటానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.ఏది ఏమైనా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలలో సంచలనం కాగా రానున్న రోజుల్లో అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందనేది చూడాల్సి ఉంది.







