మొన్నటి వరకు జగన్ కు తిరుగులేదు అని అంతా అనుకున్నా.ఇప్పుడిప్పుడే ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
క్రమంగా ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో పాటు, జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇప్పుడు కొత్త నిబంధనలు చేర్చుతూ ఉండడం, వీటిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించడం, ఆర్థికంగా ఏపీ వెనకబాటుకు గురవడం , పెరిగిపోతున్న అప్పులు, ఎన్నో సమస్యలు జగన్ ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి.
ఈ క్రమంలో రాబోయే ఎన్నికలు 2019 మాదిరిగా ఆషామాషీగా అయితే ఉండవు అనే విషయాన్ని జగన్ గుర్తించారు.
అందుకే ప్రభుత్వం పైన , పార్టీ పైన పెరిగిన వ్యతిరేకతను తగ్గించడంతో పాటు, మరింత బలోపేతం అయ్యే విషయం పైన దృష్టి సారించారు.టిడిపిని 2024 ఎన్నికల్లోనూ ఓడిస్తే ఇక ఆ పార్టీ పూర్తిగా ఏపీ లో కనుమరుగవుతుందని జగన్ అభిప్రాయపడుతున్నారు.అందుకే మరోసారి జనం లోకి వెళ్లి తన బలాన్ని పెంచుకునేందుకు, రాబోయే ఎన్నికల్లో తిరుగులేకుండా చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన పాదయాత్ర ఆయన కు ఎక్కడలేని క్రేజ్ తీసుకువచ్చింది.మళ్లీ ఇప్పుడు అటువంటి పాదయాత్ర చేపట్టేందుకు అవకాశం లేదు.
పరిపాలన పరంగా జగన్ తీరికలేకుండా ఉండడమే దీనికి కారణం.
దీంతో ఆయన బస్సు యాత్ర వంటివి మాత్రమే చేపట్టాలి.మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ, జగన్ తన యాత్ర మొదలు పెట్టే అవకాశం ఉంది.
అయితే గతంలో మాదిరిగా జగన్ పాదయాత్ర కు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల మద్దతు ఉండకపోవచ్చు.ఎందుకంటే షర్మిల తన పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించారు.
అదీ కాకుండా తల్లి విజయమ్మ, సోదరి షర్మిల తో జగన్ కు విభేదాలు ఉన్నట్లుగా చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది .దీంతో వారు జగన్ చేపట్టే యాత్రకు మద్దతు ఇవ్వడం, ప్రచారం లో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు.దీంతో జగన్ తన భార్య భారతిని ఎన్నికల ప్రచారానికి దించాలని చూస్తున్నారట.

గతంలో భారతి పులివెందుల లో జగన్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇప్పుడు మళ్ళీ ఆమెను రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ తరఫున ప్రచారానికి దించాలని జగన్ నిర్ణయించుకున్నారట.మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా భారతి ప్రసంగాలు ఇవ్వబోతున్నారట.
ఈ మేరకు ఆమెకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కార్యక్రమం కూడా నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.