సూర్యాపేట జిల్లా: సమాజంలో సమానవత్వ భావన బలపడాలంటే కులాంతర, మతాంతర వివాహాలు పెద్ద ఎత్తున జరగాలని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు జడ్జి జస్టిస్ డా.గురిజాల రాధారాణి అభిప్రాయపడ్డారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహూలగూడెం గ్రామానికి చెందిన విహెచ్ పిఎస్ జిల్లా కార్యదర్శి సోమపంగు శ్రీకాంత్, నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన తోట్ల సునీత (ఇద్దరూ వికలాంగురాలే) కులాంతర వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో కుల నిర్మూలన సంఘం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నూతన దంపతులను సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన జస్టిస్ డా.గురిజాల రాధారాణి మాట్లడుతూ దేశంలో కుల వ్యవస్థ పోవాలంటే రాబోయే కాలంలో యువత కులాంతర,మతాంతర వివాహాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అలాంటి వారికి ప్రోత్సాహం అందిచడం చాలా మంచి పరిణామమని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతీ యువతీ యువకులు వీరిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కులాంతర వివాహం చేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ మెంబెర్ డా.ఎస్.వి.సత్యనారాయణ,మానవ వికాస వేదిక జాతీయ అధ్యక్షుడు బి.సాంబశివరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క,కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు బైరి నరేష్,విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షుడు టి.రమేష్, మాతంగి అంబేద్కర్, సోషల్ టీచర్ బిబిషా తదితరులు పాల్గొన్నారు.