సినిమా ఇండస్ట్రీలో హిట్స్ దక్కితేనే జనాలు గుర్తిస్తారు.ఇండస్ట్రీ కూడా హిట్స్ ఉన్న నటీనటులనే ఎక్కువగా గుర్తుంచుకుంటుంది.
ఒక్కసారి డౌన్ ఫాల్ రావడం మొదలు అయ్యింది అంటే ఇక అంతే సంగతులు ఎంత ప్రయత్నించినా మళ్లీ వెనక్కి వస్తారని నమ్మకం లేదు.అయితే తన కెరీర్ ని తానే పోగొట్టుకున్నానని, అసలు ఈ రోజు ఖాళీగా ఉండటానికి గల కారణాలను చెబుతూ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది హీరోయిన్ లయ.
తాను ఎన్నోసార్లు మొహమాటంతో జనాలను అవకాశాలు అడిగేదాన్ని కాదని, తాను ఒకవేళ ఏదైనా అడిగి వారు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే అది వారికి ఇబ్బంది కలుగుతుందేమో అన్న భయమే తనని సినిమా అవకాశాలకు దూరం చేసింది అంటూ చెప్పుకొచ్చింది లయ.
ఇక తనకు ఎన్నో సినిమాల్లో అవకాశాలు ఇచ్చిన సురేష్ బాబు ప్రొడక్షన్స్ కోసం నువ్వు లేక నేను లేను అనే సినిమా కోసం మొదటిసారిగా క్యామియో రోల్ లో కనిపించాల్సి వచ్చిందట.సురేష్ బాబు తనున్న రూమ్ కి వచ్చి చిన్న రోల్ ఉంది, తర్వాత పెద్దవి చేద్దాం లే ఇప్పుడు ఈ చిన్న పని చెయ్యు అని అడిగేసరికి మొహమాటంతోనే ఒప్పుకుందట.అందుకే తరుణ్ కి ఆర్తి అగర్వాల్ కి మధ్య ఒక చిన్న క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది.
ఇక కల్యాణ రాముడు సినిమా కూడా వేణుతో తన హీరోయిన్ గా చేయాల్సి ఉండిందట.కానీ ఒకేసారి 45 రోజులపాటు షెడ్యూల్ అడిగేసరికి మిగతా సినిమాలకు కమిట్ అవ్వడంతో వేణు కి డేట్స్ ఇవ్వలేకపోయాను అని చెప్పింది.
అలా కళ్యాణ రాముడు సినిమా నుంచి పక్కకు వెళ్లిపోయినట్టుగా చెప్పింది లయ.ఇక తను పిఆర్ మైంటైన్ చేయడంలో కూడా చాలా వీక్ అని చెబుతోంది.మేనేజర్ల ఫోన్ నెంబర్స్ కానీ, ప్రొడక్షన్స్ నంబర్స్ తన దగ్గర ఉండవు అని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు అంటూ చెప్పుకొచ్చింది.తన మొహమాటమే తనకు సినిమాలు లేకుండా చేసిందని కానీ అది తెలుసుకునేసరికి ఆలస్యం అయిపోయిందని చెప్పుకొచ్చింది.
జగపతిబాబుతో ఒక సినిమా చేస్తున్న క్రమంలో సరదాగా హనుమాన్ జంక్షన్ లో నన్ను ఎందుకు తీసుకోలేదు అని అడిగిన ఒక్క మాటతో ఆయన అవకాశం ఇచ్చారని ఆ సినిమా ద్వారా తనకు మంచి పేరు వచ్చిందని తెలిపింది లయ.