కొద్దిరోజులుగా ఏపీలో గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతూ వస్తున్నాయి.ముఖ్యంగా టిడిపి నుంచి గెలిచిన వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉంటున్నారు.
అధికార పార్టీ వైసీపీలో చేరి ఆ పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు.ఇదిలా ఉంటే ఆయన త్వరలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి గెలవాలని, అధికారికంగా వైసీపీ ఎమ్మెల్యే అనిపించుకోవాలని చూస్తున్నారు.2019 ఎన్నికల్లో వంశీ పై పోటీ చేసి ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు మొదట్లో వంశీ రాకను వ్యతిరేకించినా, జగన్ ఆయనను బుజ్జగించి కీలక పదవి కట్టబెట్టడంతో సైలెంట్ అయిపోయారు.అవసరమైతే వంశీకి ఉపఎన్నికలు వస్తే సహకరించేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు.

అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో, అకస్మాత్తుగా మరో యువ నేత గన్నవరం నియోజకవర్గంలో హడావుడి చేస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుట్టా రామచంద్ర రావు అప్పటి ఎన్నికల్లో ఓడిపోవడంతో, ఆయన అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు.కానీ ఇప్పుడు అకస్మాత్తుగా దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్ రెడ్డి తెరపైకి వచ్చారు.ఆయన కొద్ది రోజులుగా గన్నవరం నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నాడు.దుట్టా రామచంద్రరావు వర్గానికి దగ్గరవుతూ నియోజకవర్గం పై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అంతేకాకుండా శివ భరత్ రెడ్డి వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువు అని కూడా ప్రచారం చేసుకుంటూ ఉండడంతో, అసలు ఏం జరుగుతుంది అనే ఆసక్తి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొంది.వైసీపీలో వంశీ రాకను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం ఇప్పుడు శివ ప్రసాద్ రెడ్డికి సన్నిహితంగా మెలుగుతూ వస్తుండడం, ఆయన చుట్టూ తిరుగుతూ ఉండటం, ఇక నియోజకవర్గంలోనూ అధికారులు ఆయన మాట వింటూ వస్తుండడంతో పాటు, ఇక్కడ కనుక ఉప ఎన్నికలు వచ్చినా, 2024 ఎన్నికల్లో అయినా పోటీలో ఉంటాను అన్నట్టుగా శివ భరత్ రెడ్డి వ్యవహరిస్తుండడం వంటి పరిణామాలపై వంశీ వర్గం గుర్రుగా ఉండడంతో పాటు, అసలు ఏం జరుగుతుంది అనే వివరాలు తెలుసుకునే పనిలో పడింది.
శివ భరత్ రెడ్డి జగన్ సతీమణి భారతి కి సమీప బంధువు గా ప్రచారం చేస్తుండడంతో, ఆయనకు సన్నిహితంగా మెలిగేందుకు వైసిపి నేతలు పోటీ పడుతూ ఉండడం వంటి పరిణామాలపై వంశీ వర్గం గుర్రుగా ఉంది.
ఆయన రాక వెనుక వైసీపీ అధిష్టానం ఉందా లేక సొంతంగా ఇక్కడ బలపడేందుకు ప్రయత్నిస్తున్నారా అనే విషయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.శివ భరత్ రెడ్డికి ఇక్కడ ప్రాధాన్యం పెరిగితే వంశీ పరిస్థితి ఏంటి అనే విషయంపైనా ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.