సూర్యాపేట జిల్లా:చేపల పెంపకంలో యాజమాన్యం చేపడుతున్న చర్యలు ప్రజల ప్రాణాల మీదకొస్తుంది.కుళ్లిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలనిజనం డిమాండ్ చేస్తున్న పరిస్థితి సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
జిల్లాలోని ఒక్క నడిగూడెం మండల పరిధిలోనే ఎలాంటి అనుమతులు లేవని,కనీసం మైనింగ్ అధికారుల పర్మిషన్ కూడా లేకుండా 15 లోతట్టు కుంటలు ఏర్పాటు చేసి చేపల సాగు చేస్తున్నారు.అందులో ఏడు కుంటల్లో చికెన్ వ్యర్డాలే ప్రధాన ఆహారంగా వేసి చేపల పెంపకం చేపడుతున్నారు.
చేపలకు ఆహారంగా చికెన్ వేస్ట్ వేయద్దని దానివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా కూడా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ఉండడంతో చేపల యాజమాన్యం యధేచ్చగాచేపలకు ఆహారంగా చికెన్ వ్యర్ధాలను వేస్తున్నారని, ఈ చేపలు తింటే కొత్త వైరస్ రావడం ఖాయమని ఆరోపిస్తున్నారు.కోళ్ల వ్యర్ధాలు వేస్తున్న కుంటల నుండి దుర్గంధం వెదజల్లుతుండడంతో చుట్టుపక్కల రైతులు అనారోగ్యం బారిన పడుతున్నారనివాపోతున్నారు.
చేపల సాగుకు మొక్కజొన్న కంకులను ఉడకబెట్టి చేపలకు ఆహారంగా వేయాలని ఫిషరీస్ అధికారులు సూచిస్తుంటారు.కానీ, మొక్కజొన్న కంకులు ఉడకబెట్టి నెల రోజులు చేపలకు ఆహారంగా వేస్తే 400 గ్రాములు ఎదుగుదల ఉంటుంది.
అదే చికెన్ వేస్ట్ 15 రోజులు వేస్తే 500 గ్రాములు ఎదుగుదల ఉంటుందని,కుంట యజమానులు చనిపోయిన కోళ్లను కుంటల్లో వేస్తున్నారు.వ్యాపారులు వారి స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
జిల్లా అధికారులు ఏ ఒక్క కుంట వద్దకెళ్లి కూడా తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు.ఇప్పటికే జిల్లా ఫిషరీష్ అధికారిపై పెద్ద మొత్తంలో ఆరోపణలు వస్తున్నాయి.
అయినా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడంలేదని గుసగుసలు వినపడుతున్నాయి.చాపల చెరువు కాంట్రాక్టర్లు అధికారులకు తాయిలాలు ముట్ట చెప్పడంతోనే వారిపై చర్యలు లేవని టాక్ నడుస్తుంది.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అధికారులపైన,చాపల కాంట్రాక్టర్లపైన కఠినమైన చర్యలు తీసుకొని,ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు
.