హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్( Eatala Rajender ) సరికొత్త రాజకీయంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.మొన్నటి వరకు బిజెపిలో అసంతృప్తిగా ఉన్నట్లుగా ఆయన వ్యవహరించారు.
బిజెపి చేరికలు కమిటీ చైర్మన్ గా ఆయనకు పదవి ఇచ్చినప్పటికీ, ఆయనలో ఏదో తెలియని అసంతృప్తి కనిపించేది.పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే విధంగా కొంతమంది కీలక నేతలు చక్రం తిప్పుతుండడం వంటి పరిణామాలతో రాజేందర్ అసంతృప్తికి గురై పార్టీ మారేందుకు కూడా సిద్ధమయ్యారనే వార్తలు వినిపించాయి.
ఇటీవలే బిజెపి అగ్ర నేతలు ఢిల్లీకి పిలిపించి రాజేందర్ ను బుజ్జగించారు.దీంతో పాటు, ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడుగాను ఆయనను నియమించడంతో, రాజేందర్ యాక్టివ్ అయ్యారు.
పార్టీలో అంతర్గతంగా నెలకొన్న సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు.
తాను వ్యతిరేకిస్తున్న వారిని సైతం కలుపుకుని వెళ్లే విధంగా సరికొత్త రాజకీయం మొదలుపెట్టారు.పార్టీ నేతలంతా సమన్వయంతో ముందుకు వెళ్లి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు.దీనిలో భాగంగానే బండి సంజయ్ సన్నిహితులుగా ముద్రపడిన కొంతమంది కీలక నేతలతో రాజేందర్ సమావేశం అవుతున్నారు.
ఇప్పటికే జితేందర్ రెడ్డి( Jithender Reddy ) తో ఉన్న వివాదాలకు పులిస్టాప్ పెట్టే విధంగా ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లి మంతనాలు చేసి భోజనం చేసి వచ్చారు.
గరికపాటి మోహన్ రావు( Garikapati Mohan Rao ), చంద్రశేఖర్ ఇళ్లకు వెళ్లి వారితోను అనేక విషయాలు చర్చించి భోజనం చేసి వచ్చారు.రాబోయే రోజుల్లోనూ మరి కొంతమంది కీలక నేతలతో ఇదేవిధంగా భేటీ అయ్యి వారితో కలిసి భోజనం చేసి వారితో ఏ సమస్య ఏర్పడకుండా రాజేందర్ సరికొత్తవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక త్వరలోనే బండి సంజయ్ నివాసానికి కూడా వెళ్లి ఆయనతోను సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఈ విధంగా తనను వ్యతిరేకిస్తున్న వారిని కూడా కలుపుకు వెళ్లే విధంగా ఈటెల ప్రయత్నాలు చేస్తున్నారు.