ఆంధ్రా పాలకుల పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మరల ఆంధ్రా వాళ్ళ పెత్తనాన్ని ప్రజలు అంగీకరించరనేది అందరూ తప్పక అంగీకరించాల్సిన అంశం.అయితే ఆంధ్రా ప్రాంతానికి చెందిన షర్మిల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే కొద్ది మందితో క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్న షర్మిల అధికార పక్షంపై విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.కానీ ఇప్పటి వరకు టీఆర్ఎస్ కానీ, ఇతర రాజకీయ పక్షాలు కానీ అసలు షర్మిల వ్యాఖ్యలపై కాని, షర్మిల పార్టీపై కానీ స్పందించిన పరిస్థితి లేదు.
ఏకంగా రేవంత్ రెడ్డి షర్మిల పార్టీని ఎన్జీవోతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రం సంధించిన విషయం అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఇక అసలు విషయానికొస్తే షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే ఈ పాదయాత్ర పట్ల ప్రజల్లో పెద్దగా స్పందన కనబడడం లేదు.ఎందుకంటే అసలు షర్మిల అంటేనే చాలా మంది ప్రజలకు తెలియని పరిస్థితి ఉంది.ఇక తన రాజకీయ పార్టీ గురించి అసలు సామాన్య ప్రజలకు అవగాహన ఉండే అవకాశం లేదు.దీంతో పాదయాత్రకు జనం నుండి స్పందన కరువవుతున్న పరిస్థితి ఉంది.
ఇప్పటికే చేవెళ్ళ నుండి పాదయాత్రను మొదలుపెట్టిన షర్మిల అలా నాలుగు వేల కిలోమీటర్ ల పాదయాత్రను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.కాని బండి సంజయ్ పాదయాత్రకు వచ్చిన స్పందన రీతిలో షర్మిల పాదయాత్రకు స్పందన రావడంలేదు.
ఒకవేళ ఏదైనా పార్టీ షర్మిల పాదయాత్రకు అనుకూలంగా స్పందిస్తే ఇక కెసీఆర్ మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు.తెలంగాణలో ఉంటూ ఆంధ్రా పార్టీ నేతలకు అనుకూలంగా స్పందిస్తున్నారనే ప్రచారాన్ని కెసీఆర్ బలంగా తీసుకెళ్ళే అవకాశం వంద శాతం ఉంది.