ఆ జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య ఆదిపత్య పోరు ఇంకా చల్లారలేదా.?.ఎన్నికల్లో కలసి పని చేసిన నేతలు ఆ తర్వాత ఎందుకు దూరం అయ్యారు? ఒకే సెగ్మెంట్లో పార్టీ క్యాడర్ రెండుగా చీలినా అధిష్టానం మౌనం దాల్చడానికి కారణమేంటి.? ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య రగడకు ఆ ఎంపీ మరింత ఆజ్యం పోశాడా? ఎవరా ఎంపీ?.ఎందుకు అలా చేశారు.?కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు ఇంకా రగులుతూనే ఉంది.ఎవరికి వారు మేమేమీ తక్కువ కాదన్నట్లుగా పోటీ పడుతున్నారు.2019 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ టికెట్ను హఫీజ్ ఖాన్కు పార్టీ అధిష్టానం కేటాయించింది.తనకు టికెట్ రాకపోయినా.హఫీజ్ గెలుపు కోసం ఎస్వీ మోహన్ రెడ్డి, ఆయన వర్గీయులు పని చేశారు.హఫీజ్ ఖాన్ గెలిచారు.ఆ తర్వాత ఈ ఇద్దరి నేతల మధ్య దూరం పెరిగింది.
ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు సొంతంగా నిర్వహించుకుంటున్నారు.ఇక వారి వర్గీయులయితే సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు.
ముఖ్య నేతలు సైతం సభల్లో పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు.
తాజాగా కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన వైసీపి ప్లీనరీకి ఎస్వీ మోహన్ రెడ్డి, ఆయన వర్గీయులు లేకపోవడం చర్చ నీయాంశంగా మారింది.
హఫీజ్ వర్గీయులతో మంత్రి జయరాం, ఎంపీ సంజీవ్ కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని, మేయర్ బీవై రామయ్య ప్లీనరీ నిర్వహించారు.ఈ ప్లీనరీకి ఎస్వీ వర్గం రాకపోవడానికి రెండు వర్గాల నుంచి ఎవరి వాదనలు వారువినిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్..
చేసిన వ్యాఖ్యలు హఫీజ్ ఖాన్.ఎస్వీమోహన్ రెడ్డి ఆదిపత్య పోరుకు మరింత ఆజ్యం పోసింది.
హఫీజ్ ఎదుగుదలను సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారని…రానున్న ఎన్నికల్లో హఫీజ్ భారీ మెజార్టీతో గెలుస్తాడని ఎంపీ సంజీవ్ మాట్లాడారు.దాంతో పార్టీలో విబేధాలు మరింత పెరిగాయి.అసలు ఎంపీ ఏ ఉద్దేశంతో మాట్లాడారో సొంత పార్టీ నేతలకే అర్థం కావడం లేదట.ఎన్నికలకు ఇంకా సమయం ఉంది.
టికెట్ అధిష్టానం ఎవరికి కేటాయిస్తుందో తెలియదు.కానీ ఎంపీ ఇప్పుడే పార్టీ టికెట్లపై మాట్లాడటంతో ఎస్వీ వర్గం రగిలిపోతోందట.

ఏది ఏమైనా కర్నూలు అధికార పార్టీలో ఇప్పట్లో విబేధాలు చల్లారే పరిస్థితి కనిపించడం లేదని సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది.సీఎం జగన్ స్పందించి హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి మద్య విభేదాలను తొలగించాలని.లేకపోతే కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో నష్టం తప్పదని పార్టీ నేతలు అంటున్నారు.మరి జగన్ స్పందిస్తారేమో చూడాలి.