జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ(District Collector Sandeep Kumar Jha) వెల్లడి రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ (Telangana BC Commission)ప్రతినిధుల బృందం నవంబర్ 1న కరీంనగర్ కు విచ్చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాజన్న సిరిసిల్ల మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నవంబర్ 1న కరీంనగర్ కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీ.
సీ వెల్ఫేర్ కమిషనర్లతో కూడిన బృందం ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని వెల్లడించారు.
అభిప్రాయాలు , సలహాలు, సూచనలు, తెలియజేయాలనుకునే వారు రాతపూర్వక సమర్పణలు, అభ్యర్థనలను నేరుగా ఎవరైనను సమర్పించవచ్చని సూచించారు.
వారి అభ్యర్థనలతో పాటు నిర్దేశిత నమూనాలో వెరిఫికేషన్ అఫిడవిట్ ఆరు సెట్లను తెలుగు లేదా ఆంగ్ల భాషలో ఇవ్వాల్సి ఉంటుందని, వారి వాదనలకు మద్దతుగా వారి వద్ద ఉన్న సమాచారం, మెటీరియల్, సాక్ష్యాలను, సంబంధిత కేసుల వివరాలను పేర్కొంటూ, సమర్పణలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలను కమిషన్ కు నివేదించవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు.







