సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని సీతారాంపురం దేవాలయ భూముల వేలం పాట మళ్ళీ వాయిదా పడింది.వివరాల్లోకి వెళితే… సీతారాంపురంలో వున్న శివాలయ భూమి కౌలు వివాదం నడుస్తున్న నేపథ్యంలో వేలం వేసేందుకు ఆలయ ఈవో లక్ష్మణరావు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే ఆ భూమి హద్దు రాళ్లు కొందరు తొలగించారని,కొంత భూమి ఇతరుల స్వాధీనంలో వుందని, హద్దులు తెలియకుండా కౌలు వేలం పాట ఎలా నిర్వహిస్తారని దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ రాచకొండ దేవయ్య,
నాయకులు అక్కినపల్లి జానయ్య డిమాండ్ చేయడంతో భూమి హద్దులు నిర్ణయించిన తరువాత వేలం వేస్తామని శివాలయ ఈఓ తెలిపారు.రెండవ సారి దేవాలయం నందు నిర్వహించిన వేలం పాటను వాయిదా వేయడంతో కౌలుదారులు వెళ్ళిపోయారు.
ఇదిలా ఉంటే బొడ్రాయి బజార్ లో వున్న శివాలయానికి చెందిన దుకాణం కూడ ఇతరుల ఆక్రమణలో వుందని తెలుస్తోంది.దేవాలయ ఆస్తుల పరిరక్షణ చేయవలసిన దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దేవాలయానికి తక్షణమే కమిటీ వేసి ఆలయ ఆస్తులు పరిరక్షణ చేయాలని భక్తులు కోరుతున్నారు.