నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్స్ మొత్తం సవాలక్ష సమస్యలతో సంక్షోభంలో పడ్డాయి.సంక్షేమ హాస్టళ్లపై సర్కార్ చిన్న చూపు చూస్తూ నిర్వహణకు రావాల్సిన నిధులు నిలిపివేయడంతో, విద్యార్థులకు అందాల్సిన కాస్మోటిక్ చార్జీలకు కూడా అందక హాస్టల్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
అద్దె భవనాల్లో సరైన వసతులు లేక,కొన్ని భవనాలు శిధిలావస్థకు చేరి,తలుపులు,కిటికీలు, బాత్ రూమ్ లకు డోర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు.వచ్చేది చలికాలం కావడంతో ముందస్తుగానే దుప్పట్లు పంపిణీ చేయాల్సి ఉన్నా అంతంత మాత్రంగానే ప్రక్రియను పూర్తిచేశారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి.వసతి గృహాల విద్యార్థులకు ప్రతీరోజు ఉదయం అల్పాహారం,రాత్రి భోజనం,రెండో శనివారం, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో మధ్యాహ్న భోజనం పాఠశాలల్లోనే పెట్టాలి.
బియ్యమైతే టంఛన్గా వస్తున్నాయి.టెండరు ధరలకు,మార్కెట్ ధరలకు పొంతన లేకపోవడంతో సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు.
మెజార్టీ హాస్టళ్లలో మాత్రం వార్డెన్లే ఈ బాధ్యత భుజానెత్తుకున్నారు.ఫలితంగా 3 నెలలుగా వార్డెన్లే తమ జేబుల నుంచి,ఇతరుల వద్ద అప్పులు తెచ్చి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు.
ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేసే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని గిరిజన విద్యారి సమాఖ్య రాష్ట్ర నాయకులు జటావత్ నవీన్ ఆరోపించారు.సంక్షేమ హాస్టల్స్ పై దృష్టి పెట్టకుండా పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు.
పక్కా భవనాలు లేకుండా, అరకొర అద్దె భవనాల్లో ఉంచుతూ,నిర్వహణ బాధ్యతలు విస్మరించి విద్యార్దులకు సర్కార్ నరకం చూపిస్తుందని,ఈ పద్దతి మారకుంటే భవిష్యత్ లో పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.