ఇటీవల కాలంలో తనకు ఎదురవుతున్న అనుభవాలు, చోటు చేసుకుంటున్న సంఘటనలపై మరోసారి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ( Soundaryarajan )సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR )తో నెలకొన్న విభేదాలపై స్పందించారు.
చాలాకాలంగా తాను ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించింది లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య తరచూ చర్చలు సమావేశాలు జరుగుతూ ఉండాలని, కానీ రెండు సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగడం లేదని గవర్నర్ అన్నారు.అయితే ఈ వ్యవహారానికి తాను మాత్రం కారణం కాదని , ముఖ్యమంత్రి ఇగోయిస్ట్ గా వ్యవహరిస్తున్నారని, ఆకారణంగానే తనను కలవడం లేదని గవర్నర్ అన్నారు.

ఇదే తాను ప్రశ్నించాలనుకున్న అంశం అని గవర్నర్ అన్నారు .ఒక గవర్నర్ గా తన దగ్గరకు వచ్చిన అన్ని బిల్లులను దాదాపు ఆమోదిస్తూనే ఉన్నానని, ఇప్పటికే తన దగ్గర కొన్ని బిల్లులు పరిశీలనలో ఉన్నాయని, వాటికి ఆమోదం తెలపాల్సి ఉందని అన్నారు.ఆ బిల్లులపై తాను యాక్టివ్ గానే ఉన్నానని , ఆ బిల్లులోని కొన్ని అంశాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని, వాటి గురించి తర్వాత నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందని అన్నారు.ఎవరూ తనపై ఒత్తిడి తీసుకురాలేరని, ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ తనను ఎవరు శాసించలేరని గవర్నర్ వ్యాఖ్యానించారు.

తమిళనాడు పర్యటనలో ఉన్న గవర్నర్ తమిళసై తెలంగాణకు సంబంధించిన ఒక బిల్లును తిరస్కరించడం, మరో రెండు బిల్లులపై ప్రభుత్వం నుంచి వివరణ కోరిన నేపథ్యంలో, తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్ కెసిఆర్ తో తరుచుగా ఎదురవుతున్న ఇబ్బందుల అంశాన్ని ఈ విధంగా వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో అనేకసార్లు గవర్నర్, సీఎం మధ్య ప్రోటోకాల్ వివాదం ఏర్పడింది.ఇప్పటికి ఆ వివాదం కొనసాగుతూనే ఉంది.







