సాధారణం గా ఏ రాష్ట్రం లోనైనా సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని నెలకొల్పిన తర్వాత జరిగే ఎటువంటి ఎన్నికలలో అయినా ఆ పార్టీ నే పూర్తి స్థాయి పై చేయి సాధించడం మామూలు విషయమే…అవి స్థానిక సంస్థల ఎన్నికలు అయిన పంచాయితీ ,మున్సిపల్ ,నగరపాలక ఎలక్షన్లు ఏవైనా సరే….అదే విధంగా గా MLC ఎన్నికలను కూడా ఇదే దృష్టి తో చూడటం పరిపాటి….
అధికారం లో ఉన్న పార్టీ గెలిస్తే నిధుల మంజూరు సులభతరం అవుతుందని , అభివృద్ది సాధ్యం అవుతుంది అని వంటి వివిధ ఆలోచనలు ఈ విధమైన ఫలితాలకు కారణం అవుతాయి….ఒక వేళ ఇటువంటి ఎన్నికల్లో ఏమైనా మిశ్రమ ఫలితాలు కానీ ,వ్యతిరేక ఫలితాలు కానీ వస్తే అది ఖచ్చితంగా ప్రభుత్వం లో ఉన్న పార్టీ సీరియస్ గా పరిగణించాల్సిన విషయమే….
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కాస్త అటు ఇటు గా ఇదే విధం గా సాగుతుంది…ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడేళ్ల తర్వాత నిర్వహించిన పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ( YCP ) మిశ్రమ ఫలితాలు చూడాల్సివచ్చింది….ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తన హవా చూపించినప్పటికీ తాజాగా జరిగిన పట్టభద్రుల MLC ఎన్నికల్లో మళ్లీ అదే వ్యతిరేకత చూడాల్సి వచ్చింది… అయితే ఈ MLC ఎన్నికల్లో పట్టభద్రుల తో పాటు ప్రజా ప్రతినిధుల MLC ఎన్నిక కూడా ఇమిడి ఉంటుంది….వాటిలో వైసీపీ నే పైచేయి సాధించినప్పటికీ అవి రాజకీయ పార్టీ తరపు ఎన్నికల పరిధిలోకి వస్తాయి కనుక రాష్ట్రం లో పూర్తి స్థాయి మెజారిటీ లో ఉన్న వైసిపి అభ్యర్ధి విజయం అందరూ ఊహించినదే…అలాగే ఉపాధ్యాయ MLC లో కూడా పై చేయి వైసీపీ దే… ఈ విషయం మాత్రం వైసీపీ సంతోషించదగినదే…ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల విషయం లో ముఖ్యం గా టీచర్ లకు సంబంధించి వారికి అటెండెన్స్ మరియు ఇతర విషయాల్లో కఠిన నిబంధనలు పెట్టడం ,వైన్ షాపులు దగ్గర డ్యూటీ లు వెయ్యడం వంటి విషయాల వలన ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకం గా ఉన్నారని ఇటీవల జరుగుతున్న ప్రచారాలకు ఇది చెంప పెట్టు వంటిది…
అయితే పట్టభద్రుల విషయం లో వైసీపీ పరిస్థితి తారుమారైంది… ఈ ఎన్నిక లో తెలుగుదేశం పార్టీ( TDP ) బలపరిచిన అభ్యర్ధుల హవా పూర్తి స్థాయిలో కనపడింది…టీడీపీ బలపర్చిన అభ్యర్థులు అయినటువంటి ఉత్తరాంధ్ర లో చిరంజీవి రావు ,తూర్పు రాయలసీమ లో కంచర్ల శ్రీకాంత్ ,పశ్చిమ రాయలసీమ లో రాంగోపాల్ రెడ్డి పట్టభద్రుల ఎన్నికల్లో ఘన విజయం సాధించారు….అధికారం లో ఉండి కూడా వైసీపీ తను బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోలేక పోయింది…అప్పటికే వైసిపి రిగ్గింగ్ కు పాల్పడుతోంది అని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసినప్పటికీ నిజానిజాలు పక్కకు పెడితే అధికార పార్టీ ప్రభావం మాత్రం ఏ మాత్రం లేకుండా పోయింది….
ఒకరకం గా పట్టభద్రుల అంటే ప్రత్యక్షం గా ప్రజా క్షేత్రం నుండి వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నవారు…అటువంటి ఎన్నికల్లో ఇటువంటి వ్యతిరేఖ ఫలితాలను చవిచూడటం వైసీపీ కి అంత మంచి పరిణామం కాదు…ఒక వైపు సీఎం జగన్( CM Jagan ) తమ టార్గెట్ 175 కి 175 (why not 175) అని చెప్పుకు వస్తుంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరేలా కనపడుతుంది….తమ ప్రభుత్వం పైన వస్తున్న విమర్శల విషయాల్లోనూ ,ప్రభుత్వ విధానాలలో లోటుపాట్లను పరిశీలించి ,సరిచేసుకోవాల్సిన సమయమిది…అయితే అధికార పార్టీ వైసీపీ ఈ పరిణామాన్ని సీరియస్ గా తీసుకుంటుందా లేక తమ సంక్షేమ పథకాలు,ప్రభుత్వ విధానాల పైన నమ్మకముంచి ముందుకు పోతుందా చూడాలి…
.