హైదరాబాద్ లోని అల్వాల్ లో జరిగిన ఒక సంఘటన గురించి తెలిస్తే ఎవరి గుండె అయినా తరుక్కుపోవాల్సిందే.పాపం పుట్టిన పిల్లలు కళ్ళ ఎదుటే చనిపోతారేమో అనే అనుమానం ఆ తల్లిలో రోజురోజుకు పెరగడంతో అతి దారుణమైన అఘాయిత్యానికి పాల్పడింది.
దీనికి మేనరిక వివాహమే ప్రధాన కారణం అని చెప్పవచ్చు.ఇక వివరాల్లోకెళితే నర్సింగ్ రావు కారు డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.2012లో సంధ్యారాణి (29) ని మేనరికపు వివాహం చేసుకున్నాడు.ఐదు సంవత్సరాల అనంతరం 2015లో వీరికి కవల పిల్లలు జన్మించారు.
మేనరిక కారణంగా ఒకరు అంగవైకల్యంతో జన్మిస్తే, మరొకరు గుండెలో రంధ్రంతో జన్మించారు.జన్మించి వారం రోజులు గడవక ముందే ఆ ఇద్దరు చిన్నారులు మరణించారు.
ఇక సంధ్యారాణి మళ్లీ 2018లో గర్భం దాల్చింది.కానీ శిశువు కడుపులోనే చనిపోవడంతో గర్భాస్రావం అయింది.ఇక చిన్న చిన్నగా మానసిక ఆవేదనకు గురైన సంధ్యారాణి ఈనెల 11న ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.ఇందులో ఒక ఆడ ఒక మగ శిశువు జన్మించారు.
నెలలు పూర్తికాకుండానే జన్మించిన మగ శిశువు బరువు తక్కువగా ఉండడంతో మూడు రోజులపాటు ఐసీయూలో ఉంచి వైద్యం అందించారు.ఆసుపత్రి నుండి ఈనెల 14వ తేదీ డిశ్చార్జ్ అయిన సంధ్యారాణి కు పాత జ్ఞాపకాలు వెంటాడుతూ, ఈ పిల్లలు కూడా మునపటి పిల్లల లాగా నే చనిపోతారేమో అని అనుమానం మొదలయ్యింది.
ఇక ఆదివారం అర్ధరాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో ఇంటిముందు ఉండే సంపులో పిల్లలతో పాటు దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఇక ఉదయం నిద్ర లేచిన భర్తకు భార్య బిడ్డలు కనిపించలేకపోవడంతో చుట్టుపక్కల అంతా గాలించాడు.ఇంటి ఆవరణలో ఉండే సంపు తెరచి ఉండడంతో అనుమానంగా తొంగి చూసిన నర్సింగ్ రావుకు భార్యాబిడ్డలు శవాలై తేలి ఆడుతుండడంతో గుండెలు పగిలేలా రోదించాడు.నర్సింగ్ రావు కేకలు విని చుట్టుపక్కల వారంతా వచ్చి, పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఏమైందని విచారించగా మృతురాలు రాసిన సూసైడ్ నోట్ బయటపడింది.
బిడ్డల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన, గతంలో జరిగిన సంఘటనల వల్లనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో పేర్కొంది.







