కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పై బిజెపి అధిష్టానం ఎప్పుడు సానుకూలంగానే ఉంటూ వస్తుంది .ఆయన కిందిస్థాయి నుంచి ఎదిగిన నేత కావడం ,మొదటి నుంచి బిజెపి తోనే ఆయన అనుబంధం కొనసాగుతూ ఉండడంతో, ఆయనకు ఆ స్థాయిలోనే ప్రాధాన్యత ఇస్తూ క్యాబినెట్ మంత్రిగా అవకాశం కల్పించింది.
అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి ముప్పు వచ్చినట్లుగానే కనిపిస్తోంది.ఈ మేరకు కేంద్ర బిజెపి పెద్దలు కిషన్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించి , తెలంగాణ బిజెపిలో ఆయన్ను యాక్టివ్ చేయాలని నిర్ణయానికి వచ్చారట.2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉండడం తో, ఆ ఎన్నికల్లో కిషన్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కిషన్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.
ఆ తరువాత సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.మొదటగా కేంద్ర సహాయ మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించి, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ప్రమోషన్ కల్పించారు.
అయితే ఇప్పుడు తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది.దీనికోసం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే అంశంపై దృష్టి సారించింది.
దీనిలో భాగంగానే రెడ్డి సామాజిక వర్గంలో కీలకంగా ఉన్న కిషన్ రెడ్డిని మరింతగా పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోగలిగితే , తెలంగాణలో తమకు మరింత పట్టు దొరుకుతుందని, బిజెపి అగ్ర నాయకత్వం నమ్ముతుందంట.దీనిలో భాగంగానే కిషన్ రెడ్డిని కేంద్ర మత్రి పదవి నుంచి తప్పించి, ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న లక్ష్మణ్ కు కేంద్రమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కిషన్ రెడ్డిని రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అంబర్ పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని బిజెపి అగ్ర నాయకత్వం భావిస్తోందట.

ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.2018 ఎన్నికల్లో వెయ్యి ఓట్ల తేడాతో టిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందారు.అయితే ఇప్పటికీ అంబర్ పేట నియోజకవర్గంలో కిషన్ రెడ్డికి మంచి పట్టు ఉండడం, అక్కడి నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండడం , ఈ నియోజకవర్గ ప్రజలకు బాగా సుపరిచితం కావడంతో, కిషన్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించి , సామాజిక వర్గాల లెక్కల్లో అవసరమైతే తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే విషయం కూడా హైలెట్ చేయాలనే ఆలోచనతో బీజేపీ హై కమాండ్ ఉందట.
ఆ విధంగా కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చేందుకే ఇప్పుడున్న కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలనే ఆలోచన చేస్తోందట.







