దేశవ్యాప్తంగా బిజెపిని మరింతగా బలోపేతం చేసినందుకు కేంద్ర అధికార పార్టీ బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.తమకు బలం లేని రాష్ట్రాల్లో బలపడడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.
ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ దిశగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది.ఇప్పుడు ఏపీ తెలంగాణలలో పాగా వేయడమే లక్ష్యంగా బిజెపి వ్యూహాలు రచిస్తోంది.
తెలంగాణలో బిజెపి మొదట్లో బలహీనంగా ఉన్నా, అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ బలహీనం కావడం, ఇలా అనేక అంశాలు బిజెపికి కలిసి వచ్చాయి.ఇప్పుడు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా, టిఆర్ఎస్ బిజెపి మధ్య ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి తయారయింది.
ప్రధాన ప్రతిపక్షం బిజెపినే అన్నట్లుగా అక్కడ రాజకీయం చోటుచేసుకుంది.అక్కడ పరిస్థితి పరవాలేదు అన్నట్టుగానే ఉండడంతో, ఏపీ పైన పూర్తిగా దృష్టి సారించింది.
ఏపీలో ఒంటరిగా బల్పడేందుకు అవకాశాలు లేకపోవడంతో జనసేన పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకుంది.కానీ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, రెండు పార్టీలు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం, తదితర వ్యవహారాలతో రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా, లేనట్టుగానే ఉంది.
ఈ క్రమంలో జనసేన, టిడిపి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్లుగా సంకేతాలు వెలువడడంతో బిజెపి చక్రం తిప్పింది.కొద్దిరోజుల క్రితం విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోది తో అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ కు భేటీ ఏర్పాటు చేసింది.
ఈ మేరకు పీఎంఓ నుంచి పవన్ కు పిలుపు రావడంతో ఆయన వెంటనే వెళ్లి ప్రధానితో అనేక రాజకీయ అంశాలపై చర్చించారు.

దీని వెనుక ముఖ్య ఉద్దేశం పవన్ టిడిపి వైపు మొగ్గు చూపించకుండా, బీజేపీ వైపు ఉండేలా బిజెపి అభ్యర్థులు చక్రం తిప్పారనే విషయం అందరికీ అర్థమైంది.ఏపీలో తెలుగుదేశం మరింత బలహీన పడితేనే బిజెపికి అవకాశం ఉంటుందని, టిడిపిలోని కీలక నేతలందరినీ బిజెపిలో చేర్చుకుని, బిజెపిని మరింత బలోపేతం చేయవచ్చని, బిజెపి లెక్కలు వేసుకుంటోంది.ఏపీ అధికార పార్టీ వైసిపిని బలహీనం చేయడం కంటే ప్రతిపక్షంలో ఉన్న టిడిపిని బలహీనం చేయడం ద్వారా తాము అనుకున్న టార్గెట్ ను సులువుగా పూర్తి చేయవచ్చని బిజెపి పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు.
అది సాధ్యం అవ్వాలంటే జనసేన, టిడిపిల పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని, టిడిపి ఒంటరిగా ఉంటే ఆ పార్టీని బలహీనం చేసేందుకు , తాము బల్పడేందుకు అవకాశం ఏర్పడుతుందని లెక్కల్లో కమలనాధులు ఉన్నారట.
.






