మావోయిస్టు పార్టీ నాయకులు విచక్షణ కోల్పోయి,వారి స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఏజెన్సీ ప్రాంతంలోని అమాయక ఆదివాసి ప్రజలను వాడుకుంటున్నారని,వారిపై అనేక రకాలుగా వేధింపులకు పాల్పడుతున్నారని ఇటీవల అరెస్టయిన చర్ల ఏరియా కమిటీ మెంబెర్ రజిత విచారణలో స్పష్టంగా వివరించిందని ఈ రోజు ఎస్పీ డా.వినీత్.
జి ఐపిఎస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.తెలంగాణ స్టేట్ మావోయిస్ట్ పార్టీ కమిటీ నాయకుడైన కొయ్యడ సాంబయ్య@ఆజాద్ మావోయిస్టు పార్టీలో కొత్తగా చేరిన యుక్త వయసులో ఉన్న ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడని,పార్టీలో పని చేసే చాలా మంది మహిళలను మానసికంగా వేదించేవాడని స్పష్టంగా వివరించిందని తెలిపారు.
అమాయకపు ఆదివాసి గిరిజన మైనర్లను తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటూ వారి చేత కాంట్రాక్టర్ల వద్ద నుండి డబ్బులు వసూలు చేయిస్తున్నాడని అన్నారు.ఆజాద్ ఆకృత్యాలను తెలుసుకున్న మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు అతనిని పార్టీ కార్యక్రమాలలో పాల్గొనవద్దని హెచ్చరించారని సమాచారం కలదు.
ఆజాద్,దామోదర్ మరియు ఇతర నాయకులు మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ తునికాకు కూలీలు,కాంట్రాక్టర్లు, రైతులు,ట్రాక్టర్లు,ఆటోల ఓనర్లు మరియు పేద ఆదివాసీల వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేస్తున్నారని రజిత తెలియజేసిందని తెలిపారు.ఏజెన్సీ ప్రాంతంలోని చిన్న పిల్లలతో బట్టలు ఉతికించడం,వంట చేయించడం లాంటి పనులు చేయించుకుంటున్నారని కూడా పోలీసులకు తెలియజేసింది.
సరిహద్దు గ్రామాల్లో కష్టపడి పని చేసుకునే ఆదివాసీ ప్రజల నుండి నగదు,బియ్యం,కూరగాయలు మరియు ఇతర నిత్యవసరాలను బలవంతంగా తెప్పించుకుని వాటి ద్వారానే మావోయిస్టులు జీవితాన్ని గడుపుతున్నారని రజిత తెలిపిందన్నారు.
నిషేధిత మావోయిస్ట్ పార్టీ నాయకులు ఈ విధంగా చేస్తూ ఏజెన్సీ ప్రాంత పిల్లలను చదువుకు దూరం చేస్తూ వారిచేత అసాంఘిక కార్యాకాలాపాలు చేయించుకుంటూ వారి అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఎస్పీ అన్నారు.
ఆదివాసి ప్రజల సొమ్ముతోనే జీవనం సాగిస్తూ వారినే వేధింపులకు గురిచేయడం సరికాదని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేసారు.ప్రజలెవ్వరూ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి సహకరించకూడదని,ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,వారి పిల్లల చదువు కోసం మరియు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం జిల్లా పోలీసులు పని చేస్తున్నారని వెల్లడించారు.
మావోయిస్టు పార్టీలో పనిచేసే నాయకులు,సభ్యులు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలసి మెరుగైన జీవితాన్ని గడపాలని విజ్ఞప్తి చేశారు.







