తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు.టిఆర్ఎస్ ను రాబోయే ఎన్నికల్లో ఓడించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి అంటే టిఆర్ఎస్ ను బలహీనం చేయడం ఒక్కటే ఏకైక మార్గంగా ఆయన భావిస్తున్నారు .
టీఆర్ఎస్ రెండోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇతర పార్టీలలోని నాయకులను చేర్చుకున్నారు.ముందు నుంచి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారందరికీ పెద్దపీట వేయడం, ఇప్పటికే అనేకమందికి పదవులు ఇవ్వకపోవడం ఇలా రకరకాల కారణాలతో టిఆర్ఎస్ అసంతృప్త నేతలు ఉన్నారు.
తమను కెసిఆర్ , కేటీఆర్ పట్టించుకోవడం లేదని తమ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది అనే అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి కాంగ్రెస్ లోకి తీసుకురావడం లో రేవంత్ సక్సెస్ అవుతున్నారు.అయితే జిల్లాల వారీగా వరుసగా ఈ చేరికలు చోటు చేసుకోవడానికి కారణం కేటీఆర్ బాటలోనే రేవంత్ ఉండడమే.
తెలంగాణ వ్యాప్తంగా ఏ ఏ జిల్లాల్లో, ఏ ఏ నియోజకవర్గం లో పార్టీలో అసంతృప్తులు ఉన్నారో గుర్తించి కేటీఆర్ ఆయా ప్రాంతాలపై దృష్టి పెట్టి పార్టీ నేతల మధ్య వివాదాలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి సైతం ఆ వ్యవహారాలపై దృష్టి పెట్టి అసంతృప్త నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు.
చాలా నియోజకవర్గాల్లోని ద్వితీయశ్రేణి నాయకులను సైతం కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే విషయంలో సక్సెస్ అవుతున్నారు.రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తూ … టిక్కెట్ తనకు దక్కలేదని నిరాశలో ఉన్న అసంతృప్త నేతలను గుర్తించి వారితో చర్చించి కాంగ్రెస్ కండువా కప్పెలా చేస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున నాయకులు టిఆర్ఎస్ నుంచి వచ్చి చేరారు.వీరంతా ఏదో ఒక అసంతృప్తితో పార్టీని వీడిన వారే.
ముఖ్యంగా కేటీఆర్ దూకుడు కు బ్రేకులు వేసే విధంగా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.

కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గమైన చెన్నూరు పై దృష్టి పెట్టారు.ఆ నియోజకవర్గంలో టిఆర్ఎస్ తరఫున ప్రభావం చూపగలిగిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు , ఆయన భార్య జడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మి ని కాంగ్రెస్ లో చేర్చుకుని టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు.ఇక జిహెచ్ఎంసికి సంబంధించి అన్ని వ్యవహారాలను కేటీఆర్ చూసుకుంటున్నారు.
దీంతో ఖైరతాబాద్ టిఆర్ఎస్ కార్పొరేటర్ విజయ రెడ్డిని కాంగ్రెస్ లోకి రేవంత్ తీసుకురాగలిగారు.మరికొంతమంది టీఆర్ఎస్ అసంతృప్త కార్పొరేటర్ల ను కాంగ్రెస్ వైపు నడిపించే విధంగా రేవంత్ వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ టిఆర్ఎస్ లో వర్గ పోరు పెరిగిపోవడంతో, గత కొద్ది రోజులుగా కేటీఆర్ అక్కడ పరిస్థితులను చక్కదిద్దే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పైన రేవంత్ దృష్టిసారించారు.ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు జెడ్ పి టి సి కాంతారావు తదితరులను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు.ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పై రేవంత్ దృష్టి పెట్టారు.
ఇక్కడ టిఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు వర్గ విభేదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడంతో, ఆయన టిఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు కృష్ణా రావు తో రేవంత్ మంతనాలు చేస్తున్నట్లు సమాచారం .మరి కొద్ది రోజుల్లోనే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పే అవకాశం కనిపిస్తోంది.నిత్యం టిఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు చోటు చేసుకుంటూ ఉండడం తో, రేవంత్ హవా రోజురోజుకు పెరుగుతున్నట్టు కనిపిస్తుండగా, టిఆర్ఎస్ కు మాత్రం ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.







