వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తో తెగ హడావుడి చేస్తున్న విషయం తెల్సిందే.బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ చిత్రం ప్రారంభించిన సమయంలోనే వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ను ప్రకటించాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై మొదట జనాలు పెద్దగా అంచనాలు, ఆసక్తి పెంచుకోలేదు.కాని ఒక్కో ట్వీట్, ఒక్కో స్టిల్ వదిలిన వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్పై అంచనాలు పీక్స్కు వెళ్లేలా చేశాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం కంటే కూడా ఎక్కువగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆరాటపడుతున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా ప్రేమికుల రోజు సందర్బంగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ను విడుదల చేశాడు.ఈ చిత్రంలో వర్మ ఏం చూపించబోతున్నాడు, ఏం టార్గెట్ చేయబోతున్నాడు అనేది చెప్పకనే చెప్పాడు.ఎన్టీఆర్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు అంటూ వర్మ చూపించిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పీక్స్కు చేరింది.
సినిమాలో ఎన్టీఆర్ గా నటించిన వ్యక్తి ఆ పాత్రకు ప్రాణం పోశాడు.లక్ష్మీ పార్వతి, చంద్రబాబు నాయుడు, హరికృష్ణ ఇలా అంతా కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడును వర్మ చీల్చి చెండాడు.జీవితంలో చేసిన పెద్ద తప్పు నమ్మడం అంటూ ఎన్టీఆర్ పాత్ర పోషించిన నటుడు చెప్పిన డైలాగ్ అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా ముందుగానే ప్రకటించిన వర్మ అన్నట్లుగానే నందమూరి, నారా వంశస్తులకు కునుకు లేకుండా చేశాడు.ఈ ట్రైలర్ ఇలా ఉంటే సినిమా ఇంకా ఎలా ఉంటుందో అంటూ వారు ఆందోళన చెందుతున్నారు.ఎన్నికల ముందు ఇలాంటి సినిమాలు చాలా ప్రభావంను చూపుతాయి అంటూ రాజకీయ వర్గాల వారు కూడా అంటున్నారు.







