ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ నాయకులు జంపింగ్ ల పర్వం మొదలైంది.మరో నెల రోజులో ఎన్నికల నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో రానున్న నేపధ్యంలో అక్కడ పాత రాజకీయ నాయకులు అందరూ ఎన్నికల బరిలో నిలబడటానికి పార్టీలని, అలాగే నియోజకవర్గాలని ఎంపిక చేసుకునే పనిలో పూర్తిగా నిమగ్నమై వున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయినా నేతలంతా ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు.ప్రస్తుతం ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఏదైతే బెటర్ అనే కోణంలో ఆలోచించుకొని ఆ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు.
అలాగే ప్రస్తుతం వున్న పార్టీలో సీట్లు రావనుకున్న నేతలంతా ప్రతిపక్ష పార్టీ లేదంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున అవకాశాలు సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే ఇలా కొత్తగా జంపింగ్ లతో ఏపీలో ఎన్నికల వేడి ఊపందుకుంది.
ఉత్తరాంద్ర నుంచి బలమైన నాయకులుగా గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేతలంతా ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు.ఇప్పటికే అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి తెలుగు దేశం పార్టీ అధినేతని కలవడం, పార్టీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం జరిగింది.
తాజాగా మరో మాజీ ఎంపీ, కేంద్ర మంత్రిగా పని చేసిన పార్వతీపురం మాజీ పార్లమెంట్ సభ్యులు కిషోర్ చంద్ర దేవ్ ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బేటీ కావడం జరిగింది.అనంతరం బయటకి వచ్చిన అతను త్వరలో టీడీపీ పార్టీలో చేరబోతున్నట్లు, టీడీపీతో ఏపీ అభివృద్ధి సాధ్యం అవుతుందని భావించి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం అవుతున్నట్లు మీడియాకి తెలియజేసారు.
మరి అతని చేరిక అధికారికంగా ఎప్పుడు జరుగుతుంది అనేది వేచి చూడాలి.