జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు.ఇప్పుడిప్పుడే ఏపీలో రాజకీయ దూకుడు ప్రదర్శిస్తూ… వరుస వరుసగా పార్టీలో నాయకులను చేర్చుకుంటూ… ముందుకు వెళ్తున్న పవన్ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల మీద కూడా దృష్టిపెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు.
ఎందుకంటే జనసేన బలం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతంతమాత్రంగా ఉన్న సంగతి అందరికీ తెలుసు.ఏపీలో కూడా దాదాపు అదే పరిస్థితి.
ఈ నేపథ్యంలో జనసేనకు అత్యంత కీలకమైన ఏపీ మీద తన ఫోకస్ అంతా పెట్టకుండా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలవైపు చూడడం పార్టీ నాయకులకే మింగుడుపడడంలేదు. అసలు తెలంగాణాలో ఒక్క పార్లమెంట్ సీటు గెలుచుకునే అవకాశం లేని ఈ పార్టీ ఏ ధైర్యంతో ఈ దూకుడు ప్రదర్శిస్తుంది అనే వాదన బయలుదేరింది.
గత కొద్ది రోజులుగా… తెలంగాణ లోక్ సభ నియోజకవర్గాలకు కమిటీలను నియమిస్తూ… పవన్ ముందుకు వెళ్తున్నాడు.కానీ… ఇంతవరకు ఏపీలో పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టిపెట్టలేదు.కానీ తెలంగాణలో మాత్రం తన స్పీడ్ పెంచడం ఆ పార్టీ లో ఉన్న నేతలకు భయం పట్టుకుంది.మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 12 నియోజక వర్గాలకు కమిటీలు వేశారు.ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 30 మందిని సభ్యులుగా ప్రకటించారు.వాస్తవంగా… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమికి షాక్ ఇచ్చిన కేసీఆర్, పంచాయతీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేశారు.ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ చేయాలనీ చూస్తున్నాడు.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలే భయపడిపోతున్న తరుణంలో జనసేన ఏ దైర్యం చూసుకుని ఈ ముందడుగు వేస్తుందో ఎవరికీ అర్ధం కావడంలేదు.అసలు తెలంగాణాలో పవన్ ఇప్పుడు పోటీ చేయకపోయినా… ఎవరూ పెద్దగా పట్టించుకోరు.ఎందుకంటే జనసేన కొత్తగా రాజకీయాల్లోకి రావడం… ఇప్పుడిప్పుడే పార్టీ నిర్మాణం మొదలు పెట్టడం ఇవన్నీ ప్రజల్లో చర్చకు వస్తున్నాయి.
ఏపీలో 175 నియోజకవర్గాల్లో పోటీకి సై అంటున్న జనసేన ఇంకా చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులే కనిపించడంలేదు.ఎన్నికలు సమయం చూస్తే… ముంచుకొచ్చేస్తోంది.కానీ పవన్ మాత్రం ఏపీ తో పాటు తెలంగాణ మీద ద్రుష్టి పెట్టడం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అనే లెక్కలు వేస్తున్నారు.