యజమాని చేసిన నిర్వాకానికి ఓ యువకుడు ఎంతో విలువైన 3 సంవత్సరాల కాలాన్ని కోల్పోయాడు.మతిస్తిమితం కోల్పోయి కుటుంబసభ్యులకు దూరమయ్యాడు.
పైసా పైసా కూడబెట్టి చెల్లి పెళ్లి చేయాలనుకున్న తనను యజమాని చేసిన మోసం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అలహాబాద్ కు చెందిన ఓ వ్యక్తి చెల్లి పెళ్లి కోసం డబ్బులు సంపాదించడానికి శివకాశీలోని ఓ క్యాలెండర్ తయారీ కంపెనీలో పనికి కుదిరాడు.
కొన్ని రోజులు అక్కడ పని చేసిన తర్వాత చెల్లికి పెళ్లి కుదిరిందని ఇంటి నుండి కబురు వచ్చింది.ఇదే విషయాన్ని ఆ కంపెనీ యజమానికి చెప్పి సెలవు ఇవ్వాలని, దాచుకున్న డబ్బు ఇవ్వాలని అడగ్గా ఆ యజమాని దానికి ఒప్పుకోలేదు.
పైసా పైసా కూడబెట్టిన డబ్బు లేక, సెలవులూ దొరక్క ఆ యువకుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.ఆ మానసిక ఒత్తిడి తనకు పిచ్చి పట్టేలా చేసింది.
వీధుల్లో తిరుగుతున్న అతడిని వైట్ డవ్స్ అనే స్వచ్ఛంద సంస్థ అక్కున చేర్చుకుంది.
మతిస్తిమితం కోల్పోయిన అతడికి పేరు తప్పా ఏదీ గుర్తులేదు.
వైట్ డవ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అతడికి చికిత్స అందించగా క్రమంగా కోలుకోవడం మొదలైంది.ఒక్కో విషయాన్ని చెబుతుండే వాడు.
అలా వాళ్లు అతని కుటుంబాన్ని కనుగొన్నారు.వైట్ డవ్స్ స్వచ్ఛంద సంస్థ వాళ్లు వారికి సమాచారం అందించగా వాళ్లు వచ్చి ఆ వ్యక్తిని చూసి కన్నీరు మున్నీరయ్యారు.
మూడేళ్లు ఇంటికి దూరమైన కొడుకును పట్టుకుని ఆ తండ్రీ వెక్కి వెక్కి ఏడ్చాడు.గుండెల్లో పేరుకుపోయిన బాధనంతా దించుకున్నాడు.
తర్వాత వైట్ డవ్స్ స్వచ్ఛంద సంస్థకు రుణపడి ఉంటానని చెప్పి అక్కడి నుండి తన కొడుకును తీసుకెళ్లాడు.