ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేని నీరసం కనిపిస్తోంది.ఎన్నికల సమయం ఇంకా కొద్దీ నెలలే ఉన్నా ఆ పార్టీలో మాత్రం ఎక్కడా పెద్ద దూకుడు కనిపించడంలేదు.
పాదయాత్ర ద్వారా ఒకవైపు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తూ… పార్టీకి మైలేజ్ తీసుకువస్తున్నా… మిగతా నాయకులు మాత్రం పెద్దగా దూకుడు చూపించడంలేదు.అధినేత పాదయాత్ర చేస్తున్నాడు … ఇక మేము ఏమి చెయ్యం అనే ధోరణిలోనే ఆ పార్టీ క్యాడర్ ఉండిపోతోంది తప్ప సొంతంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీపై పట్టు సాధించే ఏ ఒక్క కార్యక్రమం చేయలేకపోతున్నారు.
వైసీపీ ఏ కార్యక్రమం చేపట్టినా ఏదో ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయిందిలే అన్నట్టుగా కానిచ్చేస్తున్నారు తప్ప ఆ కార్యక్రమం ద్వారా పార్టీకి ఏ మేరకు మైలేజ్ వచ్చింది అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడంలేదు.
తాజాగా వంచనపై గర్జన పేరుతో పెద్ద కార్యక్రమం నిర్వహించారు.అయితే, ఎక్కడా దాని తాలూకు విషయం రాష్ట్రంలో చర్చకు రాలేదు.ఎన్నికల ముంగిట వైసీపీ నేతలు ఎవరూ కూడా మీడియా ముందుకు అస్సలు రావడం లేదు.
ఎవరో ఒకరిద్దరు నాయకులు గతంలో మీడియా ముందుకు వచ్చే వారు.కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితిలో ఎందుకో మార్పులు కనిపిస్తున్నాయి.
మరోవైపు చూస్తే… ఈ విషయంలో టీడీపీ దూకుడుగా ఉన్నట్టు కనిపిస్తోంది.టీడీపీ అధికార ప్రతినిధులు, మంత్రులు టీడీపీకి మైలేజ్ తీసుకువచ్చేలా ప్రయత్నిస్తున్నారు.
చాపకింద నీరులా సభ్యత్వ నమోదును వేగంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు.ఫలితంగా ప్రజల్లో టీడీపీపై చర్చ సాగుతోంది.
ఇదే స్థాయిలో జనసేన కూడా దూకుడుగా ముందుకు వెళ్తోంది.పవన్ చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలపై ప్రజల్లో మంచో చెడో కూడా ఒక చర్చ నడుస్తూనే ఉంది.
కానీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్ ఈ విషయంలో చాలా వెనుకబడిపోతున్నారనే అందరిలోనూ నెలకొంది.
మొన్నామధ్య విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ మీద జరిగిన దాడి వ్యవహారాన్ని ఆ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోలేక పోయింది.ఆ ఘటన జరిగిన రోజు తరువాతి రోజు హడావుడి చేసిన ఆ పార్టీ నాయకులు ఆ తరువాత ఎవరికి వారు సైలెన్స్ అయిపోయారు.అదేవిధంగా … ఇటీవల శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తుఫాను ఎఫెక్ట్ ను కూడా ఆ పార్టీ తమకు మైలేజ్ వచ్చే విధంగా మలుచుకోలేక పోయింది.
ఇదంతా … వైసీపీ స్వయంకృపరాధమే.ఒకవైపు ఏపీలో మూడు పార్టీల మధ్య పోరు హోరా హోరీగా సాగేలా కనిపిస్తోంది.ఈ సమయంలో జగన్ తనకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఆ క్రెడిట్ పార్టీకి వచ్చేలా చేయడంలో విఫలం అవుతున్నాడు అనే భావన ఆ పార్టీలో వినిపిస్తోంది.ఇలా చెప్పుకుంటూ పోతే… అధికార పార్టీ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమ ఖాతాలో వేసుకునే విషయంలో వైసీపీ ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉంది అనే అపవాదు మూటగట్టుకుంటోంది.