కెన్యాలో(Kenya) గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది.నైరోబి (Nairobi)సమీపంలో ఓ ఇంట్లోకి చొరబడిన సింహం, 14 ఏళ్ల బాలికను అతి కిరాతకంగా చంపేసింది.
శనివారం రాత్రి నైరోబి నేషనల్ పార్క్ (Nairobi National Park)అంచున ఉన్న ఒక నివాస ప్రాంతంలో ఈ భయంకర ఘటన జరిగింది.పార్క్ నుంచి తప్పించుకున్న సింహం, సరిహద్దు తెరిచి ఉండటంతో దగ్గర్లోని ఓ రాంచ్లోకి, అక్కడి నుంచి ఈ ఇంట్లోకి ప్రవేశించిందని అధికారులు భావిస్తున్నారు.
ఆ సమయంలో బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి ఇంట్లోనే ఉంది.ఇంతలో అకస్మాత్తుగా సింహం లోపలికి దూసుకొచ్చింది.ఆ అమ్మాయిపై దాడి చేసి, బయటకు ఈడ్చుకెళ్లింది.ఇదంతా కళ్లారా చూసిన స్నేహితురాలు షాక్తో, భయంతో వణికిపోతూ వెంటనే కేకలు వేసి, కెన్యా వైల్డ్లైఫ్ సర్వీస్ (KWS) అధికారులకు సమాచారం అందించింది.
“ఆ బాలిక గానీ, మరెవరైనా గానీ సింహాన్ని(Lion) రెచ్చగొట్టినట్లు ఎలాంటి ఆధారాలు లేవు,” అని KWS సీనియర్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ పాల్ ఉడోటో మీడియాకు స్పష్టం చేశారు.సమాచారం అందుకున్న వెంటనే KWS రేంజర్లు రంగంలోకి దిగారు.
ఇంటి నుంచి నేషనల్ పార్క్ (National Park)గుండా మ్బాగతి నది వరకు ఉన్న రక్తపు మరకల వెంట వెళ్లారు.అక్కడ, నది దగ్గర బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు.
సింహం ఆమెను చాలా దూరం లాక్కెళ్లినట్లు, ఆమె నడుము కింది భాగంలో తీవ్ర గాయాలున్నట్లు గుర్తించారు.

నైరోబి నేషనల్ పార్క్లో సింహాలు, జిరాఫీలు, మొసళ్లు, చిరుతపులులు వంటి ఎన్నో వన్యప్రాణులున్నాయి.ఈ పార్క్కు మూడు వైపులా కంచె ఉన్నప్పటికీ, జంతువులు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా దక్షిణ సరిహద్దును తెరిచి ఉంచారు.ఇదే సమీపంలోని జనావాసాలకు పెను ప్రమాదంగా మారింది.
బలహీనంగా ఉన్న లేదా తాత్కాలికంగా వేసిన కంచె మీదుగా సింహం దూకి, నివాస ప్రాంతంలోకి వచ్చి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ దారుణ ఘటన తర్వాత, భద్రతను పెంచేందుకు KWS నడుం బిగించింది.
కంచెలను బలోపేతం చేయడం, వన్యప్రాణులు సమీపంలోకి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో స్థానికులను అప్రమత్తం చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

కాగా, బాలికపై దాడి చేసిన ఆ సింహం ఇంకా దొరకలేదు.దాన్ని పట్టుకునేందుకు రేంజర్లు బోను ఏర్పాటు చేసి, తీవ్రంగా గాలిస్తున్నారు.ఈ విషాద ఘటన, ఆ ప్రాంతంలో మనుషులు-వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తూ, అందరిలో ఆందోళన కలిగిస్తోంది.