గడిచిన రెండు మూడు వారాలుగా అమెరికాలో భారతీయులు విద్వేష దాడులకు గురవుతున్న సంగతి తెలిసిందే.దీనిపై అగ్రరాజ్యంలో ఇండో అమెరికన్ కమ్యూనిటీ భగ్గుమంటోంది.
అప్పటికి కంటి తుడుపు చర్యలే తప్పించి శాశ్వత ప్రాతిపదికన కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం లేదు.అయితే అమెరికన్లు అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ భారతీయులతో పాటు విదేశీయులను టార్గెట్ చేస్తున్నారు.
భౌతికదాడులతో పాటు జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు.తాజాగా పోలండ్ పర్యటనకు వచ్చిన ఓ అమెరికన్ టూరిస్ట్ భారతీయుడిపై విద్వేషం వెళ్లగక్కాడు.
ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న భారతీయుడిని ఓ అమెరికన్ టూరిస్ట్ చూశాడు.అంతే అతని దగ్గరికి దూసుకొచ్చి.అనుమతి లేకుండా వీడియో తీస్తూ భారతీయుడిని వేధించాడు.
రికార్డింగ్ ఆపాలాంటూ బాధితుడు కోరడంతో మరింత రెచ్చిపోయాడు.నాది అమెరికా నీలాంటి వారు ఇక్కడ చాలా మంది నివసిస్తున్నారు.
ముందు నువ్వు పోలాండ్లో ఎందుకు వున్నావ్.పరాన్న జీవుల్లాగా ఇతర దేశాల్లో ఎందుకు నివసిస్తున్నారు.
మా దేశాలను మీ వాళ్లు ఆక్రమించుకుంటున్నారు.మీకు మీ దేశం వుంది కదా, శ్వేతజాతీయులు వుండే ప్రదేశాలకు ఎందుకు వస్తున్నారు.
నువ్వు నీ దేశానికి వెళ్లిపో పోలాండ్ పోలిష్లకు మాత్రమే, మిమ్మల్ని యూరప్లో వుండనివ్వదలచుకోవడం లేదు అంటూ సదరు అమెరికా వ్యక్తి.భారతీయుడిపై కారాలు మిరియాలు నూరాడు.
అయితే ఈ ఘటన పోలాండ్లో ఎప్పుడు, ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు.కానీ ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా.గత వారం డల్లాస్లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో విద్వేష దాడి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.నాకు భారతీయులంటే అసహ్యం.అక్కడ మంచి జీవితం లేకపోవడం వల్లే మీరంతా అమెరికా వస్తున్నారు.మీ దేశానికి మీరు వెళ్లిపోండి.ఎక్కడికి వెళ్లినా మీరే కనిపిస్తున్నారంటూ ఎస్మలార్డా ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి దిగింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.