మారుతున్న కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా ఇప్పుడు విద్య, ఉద్యోగాలతో పాటు వ్యాపారం కోసం భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు.అయితే ఆయా దేశాల వీసాలు దొరకడం ఇప్పుడు ఇబ్బందిగా మారుతోంది.
దరఖాస్తులు విపరీతంగా వస్తుండటంతో బ్యాక్లాగ్లు పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ సమస్య ఎక్కువగా వుంది.
ఈ నేపథ్యంలో భారతీయులకు బిజినెస్ వీసా జారీలో వున్న జాప్యంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
పీయూష్ గోయల్
స్పందించారు.దీనిపై అమెరికా నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన తెలిపారు.
తద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపారం దెబ్బతినకుండా వుంటాయని పీయూష్ గోయల్ అన్నారు.ఇండియా – యూఎస్ ట్రేడ్ పాలసీ ఫోరమ్ సమావేశం ముగింపులో ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.
ఈ సమావేశానికి అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి కేథరీన్ థాయ్తో కలిసి పీయూష్ గోయల్ పాల్గొన్నారు.
ప్రజలు తమ వాణిజ్యం, వ్యాపార ప్రయోజనాల కోసం సాధారణ వ్యాపార వీసాల జారీని వేగవంతం చేయాలని అమెరికాను అభ్యర్ధించినట్లు పీయూష్ గోయల్ చెప్పారు.
ఇరుదేశాల మధ్య వృత్తిపరమైన , నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్ధులు, పెట్టుబడిదారులు, బిజినెస్ టూరిస్ట్ల రాకపోకలు విస్తరిస్తున్నందుకు తాము సంతోషిస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు.భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు కూడా పెంచుకోవడానికి కూడా ఈ పరిణామాలు దోహదం చేస్తున్నాయన్నారు.
ఇకపోతే.విద్యార్ధి వీసాల జారీ, జాప్యంపైనా పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు.విద్యార్ధి వీసాలను అమెరికా ప్రభుత్వం త్వరతగతిన ప్రాసెస్ చేస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కోవిడ్ అనంతర పరిణామాల నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు 2022 చివరి సెమిస్టర్ తరగతులకు హాజరయ్యేందుకు అమెరికాకి రావొచ్చని పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు.
అమెరికాకు స్వల్పకాలిక బసపై వచ్చే వ్యాపారవేత్తల వీసా సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయన అభ్యర్ధించారు.
ఇదిలావుండగా.గతేడాది భారతీయ విద్యార్ధులకు అత్యధికంగా 1.25 లక్షల వీసాలను జారీ చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ గత వారం మీడియాకు తెలిపారు.2016 తర్వాత ఈ స్థాయిలో భారతీయ విద్యార్ధులకు వీసాలు మంజూరు చేయడం ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా కరోనా అదుపులోకి రావడం, ఆంక్షల్ని సడలిస్తూ వుండటంతో అమెరికాలో విద్యకు భారత్ సహా అన్ని దేశాల నుంచి డిమాండ్ మళ్లీ పెరిగిందని నెడ్ ప్రైస్ వ్యాఖ్యానించారు.
కోవిడ్ నేపథ్యంలో సిబ్బంది కొరత , ఇతర కారణాల వల్ల వీసాల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని.దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.ఏడాదిలోగా కోవిడ్ ముందు నాటి స్థితికి చేరుకుంటామని నెడ్ప్రైస్ వెల్లడించారు.