వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి.ముఖ్యంగా పాలమూరు జిల్లా రాజకీయాలు టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మధ్య విభేదాలు నెలకొన్నాయి.ఇటీవల ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా జూపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ను వీడి కారు ఎక్కడంతో కొల్హాపూర్ టీఆర్ఎస్లో అగ్గి రాజుకుంది.
దీంతో జిల్లాలో వర్గపోరుకు చెక్ పెట్టేందుకు స్వయంగా కేటీఆర్ ఎంట్రీ ఇవ్వడంతో ఇవి మరింత హీటెక్కాయి.
మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలోనూ ఇదే సీన్ నెలకొంది.
గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఒకే స్థానంలో గెలుపొందింది.ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒకరే విజయం సాధించారు.
మిగతా స్థానాలను కాంగ్రెస్, టీడీపీ తమ ఖాతాల్లో వేసుకున్నాయి.టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసమ్మతి రాజకీయాలే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమని అప్పట్లోనే కామెంట్లు వినిపించాయి.
దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిడమర్తి రవి వర్గాల మధ్య అస్సలు పొసగడం లేదని ప్రచారం జరుగుతోంది.ఆయా నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేవలం వ్యక్తిగత పర్యటనలకే పరిమితం అవుతున్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో వీరికి టిక్కెట్లు ఇస్తే పార్టీ నష్టపోతుందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో పార్టీలో గ్రూప్ రాజకీయాలను చల్లార్చేందుకు కేటీఆర్ రంగంలోకి దిగి బుజ్జగింపులు చేస్తున్నారు.
అటు పాలమూరు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఐక్యత కనిపించడం లేదు.దీంతో ఈ తగాదాలపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఇటీవల మంత్రి కేటీఆర్ కొల్లాపూర్లోని జూపల్లి నివాసానికి వెళ్లారు.
జూపల్లిని కేటీఆర్ కలవడం జిల్లా రాజకీయాలను హీటెక్కించింది.నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, గ్రూపు రాజకీయాలపై జూపల్లితో మంత్రి కేటీఆర్ చర్చించిన్నట్లు తెలుస్తోంది.
గతంలో చాలాసార్లు మాజీమంత్రి జూపల్లి తమ సమస్యలను పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.కానీ ఫలితం లేకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నారని కూడా ప్రచారం జరిగింది.