టిఆర్ఎస్ లో రాజ్యసభ స్థానాలు భర్తీ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.త్వరలోనే మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతూ ఉండడం తో ఆ స్థానాల్లో కెసిఆర్ ఎవరికి అవకాశం కల్పిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ స్థానాల్లో ఇప్పటికే హామీ పొందినవారు చాలామంది ఉన్నారు.కేసీఆర్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితులైన వారు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
వీరే కాకుండా ఉద్యమ కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకుని కెసిఆర్ ఆజ్ఞలను తు.చ తప్పకుండా పాటిస్తూ వస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు.వారంతా రాజ్యసభ స్థానం కేసీఆర్ కేటాయిస్తారని ఆశలు పెట్టుకున్నారు.ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఈ రాజ్యసభ స్థానాలు భర్తీ విషయమై తనకు అత్యంత సన్నిహితులైన కొంతమంది నాయకులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రాజ్యసభ స్థానాలను భర్తీ చేయాలని చూస్తున్నారట.ప్రస్తుతం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.
తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదగడం తోపాటు, మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు తగిన ప్రణాళికలను వేసుకున్నారు.జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొత్త కూటమిని తెరపైకి తీసుకొస్తున్నారు.
దీంతో జాతీయ స్థాయిలో టిఆర్ఎస్ ప్రభావం పెంచే వారికి అన్ని భాషలు మాట్లాడే వారికి ఈసారి రాజ్యసభ స్థానాల్లో ప్రాధాన్యం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది.
దీనికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది .ఈ నెల 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాబోతోంది.అలాగే 30వ తేదీన పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.అలాగే మరో రెండు రాజ్యసభ స్థానాలకు జూన్ 22న పదవీ కాలం ముగియనుంది.దీనికి ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడుతుంది.మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
ప్రస్తుత ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు .అంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఉన్నారు.

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పార్టీకి రాజీనామా చేయడంతో.ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ తో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారు.ఇప్పుడు ఈ స్థానానికి ఎన్నిక జరగబోతోంది.మరో రెండు స్థానాల విషయానికి వస్తే జూన్ లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి శ్రీనివాస్ పదవీకాలం ముగుస్తుంది .దీంతో ఈ మూడు స్థానాలపై చాలామంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు.ఈ మూడు స్థానాల కోసం చాలా పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం.
దీంట్లో సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నమస్తే తెలంగాణ సీఎండి దామోదర్ రావు , మాజీ సీఎండి సి ఎల్ రాజం , ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతారాం నాయక్, వేణుగోపాల చారి, తుమ్మల నాగేశ్వరరావు, గ్యాదరి బాలమల్లు, సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా పేర్లు పరిశీలనలోకి వచ్చాయట.వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారు అనేది తేలాల్సి ఉంది.







