సూర్యాపేట జిల్లా:ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.వరదలతో ఖమ్మం,సూర్యాపేట అతలాకుతలం.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఉత్తర తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుండగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం కుండపోతగా వాన కురుస్తోంది.
ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ,ఖమ్మం జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది.భారీ వర్షాలతో వరదలు పోటెత్తున్నాయి.
వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.పలు ప్రాంతాల్లో పంటపొలాల్లోకి వరద నీరు చేరింది.
గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు తెలంగాణలోని ఏడు ప్రాంతాల్లో అతి భారీ,42 ప్రాంతాల్లో భారీ,మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ముసురు వర్షం పడుతుంది.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) లో అత్యధికంగా 179 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో 147,సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 132,ఖమ్మం జిల్లా కూర్నవల్లిలో 120,బోనకల్ మండలం రావినూతలలో 120,వైరాలో 119, ఖానాపూర్ లో 118 మిల్లమీటర్ల భారీ వర్షం కురిసింది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం,మధిర, సూర్యాపేట జిల్లా మద్దిరాల,నాగారం మండలాల్లోనూ 100 మిల్లిమీటర్లకు పైగానే వర్షం కురిసింది.శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శుక్రవారం నిజామాబాద్,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి,ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.ఆదిలాబాద్,ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్,భూపాలపల్లి,నల్గొండ,సూర్యాపేట,మహబూబాబాద్,వరంగల్,హన్మకొండ,రంగారెడ్డి, హైదరాబాద్,మేడ్చల్,వికారాబాద్,మెదక్,కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ఇచ్చింది.
పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కరుస్తుందని హెచ్చరించింది.భారీ వర్షాలకు వరదలు పోటెత్తుండటంతో ప్రాజెక్టులు,చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం,గడ్డెన్న సహా పలు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తోంది.