నల్లగొండ జిల్లా:మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది.జనగామ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటంతో ఉమ్మడి ఖమ్మం,నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబరు 1ని కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ కొత్త ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అధికారులు మార్గదర్శకాలు వెలువరించారు.ఫిబ్రవరి 6 వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవటానికి అవకాశం కల్పించారు.ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధిలోని ఆర్డీఓ,తహహసీల్, మున్సిపల్ కార్యాలయాల్లో ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరిస్తారు.2021 మార్చిలో వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఎన్నికలు నిర్వహించారు.అప్పటి ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో 87,172 మంది ఓటర్లు నమోదవగా 64,824 మంది ఓటుహక్కు (74.36 శాతం) వినియోగించుకున్నారు.ఉమ్మడి ఖమ్మం,నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి 2021లో జరిగిన ఎన్నికకు 5,05,565 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు.ఈసారి ఆసంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
షెడ్యూల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.ఓటు నమోదుకు షెడ్యూల్ ప్రచురణ: 30.12.2023 దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: 6.2.2024 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన: 24.2.2024.అభ్యంతరాల స్వీకరణ: 24.2.2024 నుంచి 14.3.2024.అభ్యంతరాల పరిష్కారం: 29.3.2024.ఓటర్ల తుది జాబితా ప్రకటన: 4.4.2024.ప్రతిసారీ దరఖాస్తు చేయాల్సిందే.
గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నాం కదా ఈసారి సైతం పేరు ఓటరు జాబితాలో ఉంటుందనుకుంటే పొరపాటే.సాధారణ ఎన్నికల ఓటరు జాబితా మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా రూపొందించరనే విషయాన్ని పట్టభద్రులు గ్రహించాలి.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాను ప్రతిసారీ కొత్తగానే రూపొందిస్తారు.ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ఓటుహక్కు నమోదుకు ఇచ్చిన గడువులోపు దరఖాస్తు చేసుకున్నవారే ఓటేసేందుకు అర్హులుగా పరిగణిస్తారు.
ఉభయ జిల్లాల్లో అర్హులైన పట్టభద్రులందరూ కొత్తగా ఓటుహక్కుకు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఎవరు అర్హులు.?పట్టభద్రుల కోటాలో జరిగే ఎన్నికల్లో ఓటుహక్కు నమోదు చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.ఈ ఏడాది నవంబరు 1 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి మూడేళ్లు పూర్తవ్వాలి.
ఎన్నిక జరిగే పట్టభద్రుల నియోజకవర్గంలో నివాసితులై ఉండాలి.డిగ్రీతో సమానమైన అర్హతలు గల డిప్లొమా కోర్సులు అభ్యసించినవారూ పట్టభద్రులుగా ఓటుహక్కు నమోదు చేసుకోవచ్చు.ఫాం-18ను పూరించాలి.పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించటానికి అధికారులను ఎన్నికల సంఘం నియమించింది.
వారి వద్ద లభించే ఫాం-18ను అర్హులైన పట్టభద్రులు పూరించాలి.విద్యార్హతలను ధ్రువీకరించే డిగ్రీ,డిప్లొమా పట్టాలతో పాటు నివాస స్థలాన్ని తెలిపే ఆధార్,రేషన్కార్డు, పాస్పోర్టు వంటి ఇతర పత్రాలు,పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటో జతపరచాలి.
దరఖాస్తు సమయంలో అధికారులకు ఒరిజినల్ విద్యార్హత పత్రాలు చూపించాల్సిందే.ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు వెబ్సైట్ ద్వారా ఫాం-18ను పూరించాలి.
విద్యార్హత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి.ఓటర్ల నమోదుకు అవకాశం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని డిసెంబరు 30న ప్రారంభించారు.
ఫిబ్రవరి 6 వరకు అర్హులైన పట్టభద్రుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.ఫిబ్రవరి 21న ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసి అదేనెల 24న ప్రచురిస్తారు.మార్చి 14 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.29న వాటిని పరిష్కరిస్తారు.ఏప్రిల్ 4న ఓటరు తుది జాబితా ప్రచురిస్తారు.పట్టభద్రులు ఓటుహక్కు నమోదు చేసుకోవటానికి ఎన్నికల అధికారులు మండలాల వారీగా దరఖాస్తులు పంపించనున్నారు.ఉమ్మడి ఖమ్మం,నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి 2021 లో జరిగిన ఎన్నికకు 5,05,565 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు.ఈసారి ఆసంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.