కొన్ని రోజులుగా ఉత్కంఠకు గురిచేసిన మహారాష్ట్రలోని రాజకీయ సంక్షోభానికి తెరపడింది.సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేశారు.
కొత్త కేబినెట్ కూడా కొలువుదీరింది.శివసేన పార్టీ రెండు ముక్కలైంది.
థాక్రే వర్గం, షిండే వర్గంగా ఎమ్మెల్యేలు విడిపోయారు.శివసేన పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేందరూ షిండే శిబిరంలో చేరిపోయారు.
దీంతో ఇప్పుడు తామే శివసేన వారసులమంటూ షిండే వర్గం ప్రకటనలు గుప్పిస్తోంది.అయితే థాక్రే వైపు ఉన్న ఎంపీలు కూడా షిండే వర్గం వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది.
ఇప్పటికే కొందరు ఎంపీలు షిండే వర్గంలో చేరిపోగా కొద్దిరోజుల్లో మిగిలిన ఎంపీలు కూడా తంతు పూర్తి చేస్తారని తెలుస్తోంది.ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తన సంఖ్యా బలాన్ని మించి ఎమ్మెల్సీలను గెలుచుకుందని.
శివసేనలోని ఎమ్మెల్యేల తిరుగుబాటే దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే తాము మద్దతు ఇస్తామని సీఎం షిండే ప్రకటించారు.
ఇప్పుడు శివసేన శిబిరంలో థాక్రే చేయగలిగిందేమీ లేదు.పరిస్థితి మొత్తం బీజేపీ కంట్రోల్లో ఉంది.
శివసేన పార్టీని నడిపించే సామర్ధ్యం ఉద్ధవ్ థాక్రేకు లేవని ఇపుడు ఆ పార్టీలోని మెజారిటీ నాయకులు బలంగా విశ్వసిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.ఇప్పుడు శివసేన పార్టీని మొత్తం తనవైపుకు తిప్పుకోవాలని షిండే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
తాను ఇటీవల తిరుగుబాటు నేతలకు నాయకత్వం వహిస్తున్నపుడు కొంతమంది థాక్రే వర్గానికి చెందిన నాయకులు ఆటో రిక్షా డ్రైవర్ అని తనను ఎగతాళి చేశారని.కానీ ఇప్పుడు ఆటోరిక్షానే మెర్సిడెజ్ను వెనక్కి నెట్టిందని ఏక్నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు త్రీవీలర్ ప్రభుత్వం అని పిలిచేవారని, అయితే ఇప్పుడు త్రీవీలర్ నడిపిన వ్యక్తి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని షిండే స్పష్టం చేశారు.బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి తమకు మద్దతు ఇచ్చారని షిండే అన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ప్రధాని మోదీ తనకు సూచించారని షిండే చెప్పారు.