వైసీపీ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధం అవుతోంది.ఈనెల 8,9వ తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
అయితే ఈ ప్లీనరీకి సంబంధించి వైసీపీ క్యాడర్లో మాత్రం ఎలాంటి హడావిడి కనిపించడం లేదు.అధికారంలోకి రావడానికి పదేళ్ల పాటు పాటు పడిన కార్యకర్తలను నాయకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో సీఎం జగన్ పలు జిల్లాలలో పర్యటిస్తున్నా ఎక్కడా కార్యకర్తలను ఆయన కలిసిన దాఖలాలు లేవు.అటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలను పట్టించుకోవడం లేదు.క్యాడర్ పార్టీకి చాన్నాళ్ళుగా దూరంగా ఉంటోంది. 2017 వైసీపీ ప్లీనరీలో ఉరకలెత్తిన క్యాడర్ ఈసారి మాత్రం అలిగి దూరంగా ఉందని టాక్ నడుస్తోంది.
ప్లీనరీకి ఇంకా రెండు రోజుల సమయం ఉన్నా జిల్లాలలో మాత్రం ఎలాంటి ప్రస్తావన లేదు.దీంతో ప్లీనరీని భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తున్న వైసీపీ హైకమాండ్కు ఈ విషయం మింగుడు పడకుండా ఉంది.
వైసీపీ క్యాడర్లో అసంతృప్తి ఉందని ఎన్నికల వ్యూహకర్త రుషిరాజ్ సింగ్ బృందం కూడా ఇటీవల అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో హైకమాండ్ మేలుకుని క్యాడర్లో మెరికల్లాంటి వారిని గుర్తించి వారికి వరాలు ఇవ్వాలని, ప్రభుత్వ పరంగా చేయాల్సింది కూడా వెంటనే అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
మొత్తం 120 నియోజకవర్గాలలో బలమైన క్యాడర్కు త్వరలో సముచితమైన స్థానం కల్పించేలా చర్యలు ఉంటాయని వైసీపీ నేతలు చెప్తున్నారు.

కాగా ఈనెల 8న ఉదయం 8 గంటల నుంచి వైసీపీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఉదయం 10:55 గంటలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల కానుంది.ఈ ప్రకటనను పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేయనున్నారు.ఉ.11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం జరుగుతుంది.పలు తీర్మానాల అనంతరం సాయంత్రం 5 గంటలతో మొదటిరోజు ప్లీనరీ సమావేశం ముగుస్తుంది.







