నల్లగొండ జిల్లా: 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ మరియు ఎంసీఏలో ప్రవేశాల కొరకు నిర్వహించే ఐసెట్ 2025( ICET 2025 ) నిర్వహణ బాధ్యతను తెలంగాణ ఉన్నత విద్య మండలి, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండకు ఇవ్వడం విధితమే.ఐసెట్ 2025 కు చైర్మన్ గా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్,కన్వీనర్ గా రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి వ్యవహరించనున్నారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్లగొండలో ఐసెట్ 2025 నోటిఫికేషన్ ను సెట్ చైర్మన్ మరియు కన్వీనర్ ఇతర విశ్వవిద్యాలయ అధికారుల సమక్షంలో విడుదల చేశారు.
జూన్ 8 మరియు 9 తారీకుల్లో నాలుగు విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు.ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 10 నుండి మే 3వ తారీకు వరకు సమర్పించవచ్చున్నారు.50 రూపాయల అపరాధ రుసుముతో మే 17 వరకు 500 రూపాయల అపరాధ రుసుముతో మే 26 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు 550 రూపాయలు, సాధారణ అభ్యర్థులు 750 రూపాయలు పరీక్ష రుసుము చెల్లించాలని తెలిపారు.ఆన్లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు మే 16 నుండి మే 20 వరకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
నాలుగు విడతలుగా జరగనున్న పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ విడత పరీక్షలు నిర్వహించనున్నారు.పరీక్ష యొక్క ప్రాథమిక కీ జూన్ 21న విడుదల చేయనున్నారు.
ప్రాథమిక కీ పై అభ్యంతరాలు తెలుపుటకు జూన్ 22 నుండి జూన్ 26 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.జూలై 7న తుది కీ మరియు పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆచార్య అల్వాల రవి తెలిపారు.
పరీక్షలో సాధారణ అభ్యర్థులకు 25 శాతం మార్కులు,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత శాతం ఏమీ లేనట్లు ఉన్నత విద్య మండలి తీర్మానించినట్లు తెలిపారు.అభ్యర్థులు అర్హతలు, సిలబస్,మోడల్ పేపర్ మరియు ఆన్లైన్ దరఖాస్తు లు వంటి పూర్తి వివరాలకు https://icet.tsche.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపారు.
ఐసెట్ 2025, నోటిఫికేషన్ విడుదల సందర్భంగా చైర్మన్ మరియు ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన పీ-సెట్ మరియు ఎడ్-సెట్ మాదిరిగానే ఐసెట్ -2025 సైతం చక్కని అవకాశంగా భావించి సమర్థతను చాటి చెప్పాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐక్యుఏసి, డైరెక్టర్,డా.
రమేష్,డీన్ ఆచార్య బి.సరిత,సిఓఈ డా.ఉపేందర్ రెడ్డి,ఆడిట్ సెల్ డైరెక్టర్ డా.వై.ప్రశాంతి, ప్రిన్సిపాల్ డా.కె.శ్రీదేవి, అరుణప్రియ,సుధారాణి,డా.సబీనా హెరాల్డ్,ఆచార్య అన్నపూర్ణ,డా.
జక్కా సురేష్ రెడ్డి,డా.హరీష్ కుమార్,డా.
సంధ్యారాణి,డా.ఎస్.శ్వేత తదితరులు పాల్గొన్నారు.