ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో గొప్పది.ఓ చిన్నారికి విద్యా బుద్ధులు నేర్పి వారిని జీవితంలో పైకి తీసుకు వస్తారు ఉపాధ్యాయులు.
మంచి, చెడు నేర్పి జీవితాన్ని ఎలా జీవించాలో చెబుతారు.ఉపాధ్యాయ వృత్తికి సరి సమానమైన మరో వృత్తి లేదంటే అతిశయోక్తి ఏమీ కాదు.
తర తరాల తల రాతను మార్చే శక్తి వారికి ఉంటుంది.కానీ కొందరు మాత్రం ఆ వృత్తికే కలంకం తీసుకు వస్తారు.
వారి ప్రవర్తనతో టీచర్లు అంటేనే అదో రకమైన భావన తీసుకువస్తారు.తప్పు చేసిన విద్యార్థులపై కాస్త కఠినంగా ఉండటంలో ఎలాంటి తప్పూ లేదు.
కానీ దేనికైనా ఒక పరిమితం అంటూ ఉంటుంది అనేది గుర్తుంచు కోవాల్సి ఉంటుంది.అదే మరచి పోతున్నారు కొందరు ఉపాధ్యాయులు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా అసోహా మండలం ఇస్లామ్ నగర్ లో ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టీచర్ చేసిన ఆ పనికి నెటిజన్లు మండి పడుతున్నారు.
ఓ ఐదేళ్ల చిన్నారి పట్ల ఆ టీచరమ్మ క్రూరంగా ప్రవర్తించింది.హోం వర్క్ ఎందుకు చేయలేదంటూ 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు కొట్టింది.
ఇస్లామ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో జులై 9న ఈ ఘటన జరిగింది.అదే రోజు సాయంత్రం బాలిక తల్లి దండ్రులు చిన్నారి ముఖంపై వాతలు గుర్తించి… వెంటనే బడికి వచ్చారు.
టీచర్ ను తీవ్రంగా మందలించారు.మళ్లీ ఇలాంటి పని చేయనని ఆమెతో లేఖ రాయించారు.
అయితే అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు.
విద్యార్థిని కొట్టిన ఆ టీచర్ ను, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు.